Dasari Narayana Rao: వెండితెరకు దాసరి జీవితం

14 Jan, 2022 08:21 IST|Sakshi

దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు జీవితం వెండితెరకు రానుంది. సీనియర్‌ దర్శకుడు ధవళ సత్యం ‘దర్శకరత్న’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కించనున్నారు. ఇమేజ్‌ ఫిలింస్‌ పతాకంపై తాడివాక రమేష్‌ నాయుడు నిర్మించనున్నారు. గురువారం విలేకరుల సమావేశంలో ధవళ సత్యం మాట్లాడుతూ– ‘‘రచయితగా, దర్శక–నిర్మాతగా ఎందరికో మార్గదర్శకుడైన దాసరిగారితో నాది విడదీయలేని అనుబంధం. ఆ బంధమే ‘దర్శకరత్న’ చేసేందుకు నన్ను పురిగొల్పింది’ అన్నారు.

తాడివాక రమేష్‌ నాయుడు మాట్లాడుతూ– ‘‘ఓ జాతీయ స్థాయి నటుడు దాసరిగారి పాత్రను పోషిస్తారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో పాన్‌ ఇండియా సినిమాగా రూపొందించనున్నాం’’ అన్నారు. డైరెక్టర్‌ రేలంగి నరసింహారావు, నిర్మాతల మండలి కార్యదర్శులు ప్రసన్నకుమార్, మోహన్‌ వడ్లపట్ల, డైరెక్టర్‌ కాశీ విశ్వనాథ్, తెలంగాణ  ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ పి.రామకృష్ణగౌడ్, సీనియర్‌ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, వినాయకరావు తదితరులు దాసరితో తమ అనుబంధం గురించి మాట్లాడారు.  

మరిన్ని వార్తలు