Nayantharta Vignesh : నయనతార-విగ్నేశ్‌ సరోగసి వివాదంలో కీలక మలుపు

13 Oct, 2022 09:09 IST|Sakshi

తమిళసినిమా: నటి నయనతార సరోగసి పద్ధతి ద్వారా కవలపిల్లలకు తల్లి అయిన వి షయం తెలిసిందే. అయితే ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నయనతార ఈ వ్యవహారంలో నిబంధనలను పాటించారా? లేదా? అన్న విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. కారణం సరోగసి విధానంతో అద్దె తల్లి ద్వారా పిల్లలను కనడం అన్న అంశంపై ఈ ఏడాది జనవరిలోనే నిషేధం విధించారు. అలాంటిది గత జూన్‌ నెలలో నయనతార దర్శ కుడు విఘ్నేష్‌ శివన్‌ను పెళ్లి చేసుకున్నారు. నాలుగు నెలల్లోనే నయనతార ఈ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు కావడం వివాదంగా మారింది.

సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కనడానికి కొన్ని చట్టపరమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నటి కస్తరి లేవనెత్తారు. సరోగసి ద్వారా తల్లిదండ్రులు కావాలనుకుంటే వారికి పెళ్లి జరిగి కనీసం మూడేళ్లు పూర్తవ్వాలి. అలాగే తల్లికి పిల్లలు పుట్టే అర్హత లేకపోవడమో, లేక ఆమెకి ఇష్టం లేకపోవడమో వంటి తగిన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. అయితే నటి నయనతార ఈ విషయంలో విధి, విధానాలను మీరినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ వ్యవహారంలో నటి నయనతారను వివరణ కోరుతామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై కూడా పెద్ద చర్చే జరుగుతోంది. ఈ వ్యవహారంలో న్యాయనిపుణులు కూడా నయనతారకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ వ్యాఖ్యలు చేస్తున్నారు. పిల్లలను పొందడానికి నయనతార, విఘ్నేష్‌ శివన్‌ ముందుగానే చట్టబద్ధంగా నమోదు చేసుకున్నారని, కాబట్టి వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేదని కొందరు న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. వీరి సంగతి ఇలా ఉంటే వీరికి అద్దె తల్లి ద్వారా కవల పిల్లలు జన్మించారు.

చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్‌ ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యుడు నయనతారకు అద్దె తల్లి ద్వారా పిల్లలకు తల్లి కావచ్చని సలహా ఇచ్చినట్లు సమాచా రం. దీంతో వైద్యాధికారులు ఆస్పత్రి సిబ్బంది, వైద్యులపై చర్యలు తీసుకునే విషయమై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో అనే ఆసక్తి నెలకొంది

మరిన్ని వార్తలు