Balagam Movie: నమ్మకం నిజమైంది.. బలగానికి పెరుగుతున్న వసూళ్లు: దిల్‌ రాజు కుమార్తె

18 Mar, 2023 08:44 IST|Sakshi

‘‘ప్రతి ఊరిలో, ప్రతి కుటుంబంలో జరిగే కథే ‘బలగం’. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని వేణు కథ చెప్పినప్పుడే నమ్మాం. అది నిజమైంది’’ అని నిర్మాతలు హర్షిత్‌ రెడ్డి, హన్షిత (‘దిల్‌’ రాజు కుమార్తె) అన్నారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌ జంటగా వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బలగం’. ‘దిల్‌’ రాజు సారథ్యంలో శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది.

ఈ సందర్భంగా హన్షిత మాట్లాడుతూ– ‘‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నాన్నగారు (‘దిల్‌’ రాజు) తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో భారీ సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించడంతో పాటు ప్రయోగాత్మక, వైవిధ్యమైన కథలను చిన్న సినిమాల ద్వారా ప్రేక్షకులకు అందివ్వాలనే ‘దిల్‌’ రాజు ప్రొడక్షన్‌ బ్యానర్‌ని స్థాపించాం. ‘బలగం’ని ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో చూశాక నాన్నగారు ‘మీరు ఎన్ని సినిమాలు తీసినా ‘బలగం’ మాత్రం గుర్తుండిపోతుంది’ అని అభినందించారు’’ అన్నారు. హర్షిత్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘బలగం’ చిత్రానికి రోజు రోజుకు వసూళ్లు పెరుగుతున్నాయి. మా తొలి సినిమాకే ఇంత మంచి పేరు రావడం హ్యాపీ. ప్రస్తుతం యష్‌ మాస్టర్‌ హీరోగా శశి అనే కొత్త డైరెక్టర్‌తో ఓ సినిమా నిర్మిస్తున్నాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు