కంటెంట్‌ ఉంటే ఏ సినిమానైనా ఆదరిస్తారు: దిల్ రాజు

13 Mar, 2023 20:38 IST|Sakshi

నేహా, వేదాంత్‌ వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా నటించిన చిత్రం 'లిల్లీ'. ఈ చిత్రంలో రాజ్‌వీర్‌ ముఖ్య పాత్ర పోసిస్తున్నారు. ఈ సినిమాతో శివమ్‌ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కించారు. గోపురం స్టూడియోస్‌ పతాకంపై కె.బాబురెడ్డి, జి.సతీష్‌ కుమార్‌లు నిర్మించారు.  తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'RRR సినిమాకు ఆస్కార్ ఆవార్డ్‌తో ప్రపంచం వ్యాప్తంగా  తెలుగు సినిమాకు మంచి పేరు తీసుకొచ్చిన చిత్రబృందానికి నా ధన్యవాదములు. నా చిన్నతనంలో  శివ కృష్ణ సినిమాలు ఆడపడుచు, అనాదిగా ఆడది లాంటి సినిమాలు విపరీతంగా నచ్చేవి. ఇలాంటి చిన్న పిల్లలు సినిమాలు తియ్యాలని ప్రోత్సహిస్తున్న   శివ కృష్ణకు ధన్యవాదాలు. చిన్న సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. లిటిల్ సోల్జర్స్,  అంజలి సినిమాలు చాలా ఇష్టం. మంచి కంటెంట్‌తో  సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు.

చిత్ర నిర్మాతలు కె.బాబురెడ్డి, జి.సతీష్‌ కుమార్‌  మాట్లాడుతూ.. 'మేము తీస్తున్న  తొలి చిత్రం "లిల్లీ". ఈ సినిమాతో పాటు తమిళంలో రంగోలి సినిమా చేస్తున్నాం. దర్శకుడు శివమ్ చిన్న పిల్లలపై   సినిమా చేద్దాం అన్నారు. కథ నచ్చడంతో తనను దర్శకుడుగా పరిచయం చేస్తూ తీశాం. ఈ సినిమాలో సీనియర్ నటులు శివకృష్ణ చాలా మంచి సపోర్ట్ చేశారు. ఇందులో నటించిన వారందరూ చిన్న పిల్లలు చక్కగా నటించారు. మా సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.' అని అన్నారు.

నటుడు శివకృష్ణ మాట్లాడుతూ..'RRR ద్వారా  తెలుగు ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన రాజమౌళి  టీమ్‌కు అభినందనలు. ఎన్నో సినిమాలు చేస్తూ ఎంతో మందికి అవకాశాలిస్తున్న దిల్ రాజుకు థాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో నా మనువడు  వేదాంత్ వర్మ కూడా ఎంతో చక్కగా నటించారు. తనతో పాటు నేహ, దివ్య లు చాలా బాగా నటించారు. ఈ ముగ్గురు ‘లిల్లీ' చిత్రంతో నటులుగా పరిచయం అయినందుకు సంతోషంగా ఉంది. పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ లిల్లీ చిత్రం బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు.

చిత్ర దర్శకుడు శివమ్‌ మాట్లాడుతూ..'మన తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి టీంకు ధన్యవాదములు. నేను ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు అయ్యింది. దిల్ రాజు  తన సినిమాల ద్వారా ఎంతోమంది రైటర్స్, దర్శకులకు, కార్మికులకు ఉపాధినిచ్చారు. మా లిల్లీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా కచ్చితంగా కంట తడి పెట్టకుండా బయటికి పోరు. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.' అని అన్నారు.


 

మరిన్ని వార్తలు