Godse Director: అదే విషయాన్ని ‘గాడ్సే’తో సీరియస్‌గా చెప్పే ప్రయత్నం చేశాం

15 Jun, 2022 08:12 IST|Sakshi

‘‘కొన్ని సినిమాలు చూసి ప్రజలు చెడిపోతున్నారని కొందరు అభిప్రాయపడుతుంటారు. కానీ అదే సినిమాల్లో మంచి చెప్పినప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ‘గాడ్సే’ ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రం’’ అన్నారు దర్శకుడు గోపీ గణేష్‌ పట్టాభి. ‘బ్లఫ్‌ మాస్టర్‌’ తర్వాత హీరో సత్యదేవ్, దర్శకుడు గోపీ గణేష్‌ పట్టాభి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘గాడ్సే’. సి. కల్యాణ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు గోపీ గణేష్‌ విలేకర్ల సమావేశంలో చెప్పిన విశేషాలు. 

‘గాడ్సే’ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌ సీన్‌లో ఓ డ్రామా ఉంటుంది. అదేంటంటే.. గాంధీ పాత్రధారిని గాడ్సే కాల్చాలి. కానీ గాడ్సే పాత్రధారి అయిన చిన్నపిల్లవాడు బొమ్మ తుపాకీతో కూడా గాంధీ పాత్రధారిని కాల్చి చంపడానికి అంగీకరించకుండా తుపాకీని కిందకు దించుతాడు. అలాంటి పిల్లవాడు పెద్దవాడు అయ్యాక రియల్‌ గన్స్‌తో ఎందుకు సహవాసం చేయాల్సి వస్తుంది? అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం వల్ల అతని వ్యక్తిత్వం, ఆలోచనా తీరు మారింది? అన్నదే కథాంశం.  

⇔ ఈ కథను చెప్పేందుకు ఓ బ్యాచ్‌ రీ యూనియన్‌ అవుతున్నట్లుగా బ్యాక్‌డ్రాప్‌ తీసుకున్నాను. ఓ సర్వే ప్రకారం చదువుకున్న అర్హతకు తగ్గ ఉద్యోగం చేస్తున్నవారు కేవలం 6.37 శాతం మంది మాత్రమే అని, మిగిలినవారు చదువుకు తగ్గ ఉద్యోగం చేయడం లేదని తెలుసుకున్నాను. ఇదే విషయాన్ని కాస్త సీరియస్‌గా చెప్పే ప్రయత్నం చేశాం. ఎవర్నీ టార్గెట్‌ చేసి తీసిన సినిమా కాదు. ఆలోచించాల్సిన అంశంగా తీసిన చిత్రం మాత్రమే. 

నిజానికి ‘గాడ్సే’ కథను పవన్‌ కల్యాణ్‌గారికి అనుకున్నాను. కానీ ఆయనతో చేయలేకపోయాను. ఈ కథను సత్యదేవ్‌గారికి చెప్పినప్పుడు సీరియస్‌ సబ్జెక్ట్‌ అన్నారు. కానీ ఓకే చేశారు. ఓ కామన్‌మేన్‌ పాత్రలో సత్యదేవ్‌ అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు ప్రతి కామన్‌ మేన్‌ కనెక్ట్‌ అవుతాడనే నమ్మకం ఉంది.   

మరిన్ని వార్తలు