ప్రతి పాత్ర కథకు కనెక్ట్‌ అయ్యుంటుంది

3 Jan, 2021 01:04 IST|Sakshi

రామ్‌ మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘రెడ్‌’. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా కిశోర్‌ తిరుమల చెప్పిన విశేషాలు.

► ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో మాస్‌గా కనిపించారు రామ్‌. ఆ తర్వాత వచ్చే ఈ సినిమాలోనూ అలాంటి ఒక క్యారెక్టర్‌ ఉంటే బాగుంటుందనుకున్నాం. అలా ఒక పాత్ర, నా స్టైల్‌ ఆఫ్‌ హీరోలా మరో క్యారెక్టర్‌ ఉంటుంది. రామ్‌తో నేను తెరకెక్కించిన మొదటి సినిమా (నేను శైలజ) లవ్, తర్వాత ఫ్రెండ్‌షిప్‌ (ఉన్నది ఒకటే జిందగీ). ఇప్పుడు తనతో చేసిన మూడో సినిమా ‘రెడ్‌’లో చాలా షేడ్స్‌ ఉన్నాయి.

► మాములుగా హీరోకి రెండు క్యారెక్టర్లు ఉంటే ఒకటి సాఫ్ట్, రెండోది రఫ్‌ అన్నట్లు ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలా ఉండదు. రామ్‌లో కొత్త యాంగిల్‌ కనబడుతుంది. అలాగే దర్శకుడిగా నాలోనూ కొత్త యాంగిల్‌ చూస్తారు. హీరో బాగా డ్యాన్స్‌ చేస్తాడు కాబట్టి ఓ మాస్‌ పాట పెట్టాం. రామ్, నేను రెండు సినిమాలు చేశాం కాబట్టి మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది.

► ఈ సినిమాలోని ప్రతీ క్యారెక్టర్‌ కథకు కనెక్ట్‌ అయ్యుంటుంది. ముగ్గురు హీరోయిన్లదీ మంచి క్యారెక్టరైజేషన్‌. నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్, మాళవికా శర్మ పాత్రలు ఆకట్టుకుంటాయి. అయితే నివేదా పాత్ర ఇంకొంచెం బలంగా ఉంటుంది.

► జనరల్‌గా థ్రిల్లర్‌ సినిమా అంటే ఒక మీటర్‌లో ఉంటుంది. అయితే థ్రిల్లర్‌ ప్రధానంగా సాగే ‘రెడ్‌’ సినిమా అలా అనిపించదు. ఈ చిత్రంలో డ్రామా, యాక్షన్, థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌ ఉండటంతో పక్కా కమర్షియల్‌ చిత్రంలా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ మెచ్చే విధంగా ఉంటుంది.

► అప్పట్లో చెన్నైలో ఉండటంవల్ల ఓ తమిళ సినిమా చేశాను. ఆ తర్వాత తెలుగు మీద దృష్టి పెట్టాను. లాక్‌డౌన్‌లో శర్వానంద్‌ కోసం ఓ కథ, మరో రెండు స్క్రిప్ట్‌లు తయారు చేసుకున్నాను. ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేశాను.

మరిన్ని వార్తలు