కమల్‌ చిత్రంపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు 

14 Jun, 2021 08:20 IST|Sakshi

చెన్నై: ప్రముఖ నటుడు, మక్కల్‌నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్‌ తాజా చిత్రాలపై కోలీవుడ్‌లో అయోమయ పరిస్థితి నెలకొంది. కమలహాసన్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో విక్రమ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఇండియన్‌–2 చిత్రంతో పాటు ఆయన స్వీయ నిర్మాణంలో రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో విక్రమ్‌ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అనివార్య కారణాల వల్ల ఇండియన్‌–2 చిత్రం షూటింగ్‌ చిక్కుల్లో పడింది.

షూటింగ్‌ వ్యవహారం కోర్టులో ఉంది. దీంతో ఇండియన్‌–2 చిత్ర సమస్య పరిష్కారం అయ్యేవరకు కమలహాసన్‌ నటిస్తున్న మరో చిత్రం విక్రమ్‌ షూటింగ్‌ వాయిదా పడినట్టు, దీంతో కమలహాసన్‌ మలయాళ చిత్రం దృశ్యం–2 రీమేక్‌లో నటించడానికి సిద్ధం అవుతున్నట్టు రకరకాల ప్రచారం జరుగుతోంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో విక్రమ్‌ చిత్ర షూటింగ్‌పై దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ క్లారిటీ ఇచ్చారు. విక్రమ్‌ చిత్రం షూటింగ్‌ వాయిదా పడలేదని, లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే షూటింగ్‌ ప్రారంభించనున్నట్టు ఆదివారం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అదే విధంగా ఈ చిత్రానికి స్టంట్‌ మాస్టర్ల ద్వయం అన్బరివు పోరాట దృశ్యాలను కంపోజ్‌ చేసినట్లు తెలుపుతూ వారితో కమలహాసన్, తనూ కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్‌ చేశారు.

చదవండి : రిస్కీఫైట్స్‌కు రెడీ

మరిన్ని వార్తలు