Director Maruthi: దొంగతనంగా కలుసుకునేవాళ్లం, నా స్కూటీపై తిరిగేవాళ్లం: మారుతి భార్య

5 May, 2023 12:58 IST|Sakshi

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. ఒక్కసారి హిట్‌ వచ్చిందంటే నెక్స్ట్‌ అంతకు మించిన సినిమా తీయాలి. తేడా కొట్టి ఫ్లాప్‌ అయిందంటే విమర్శలను ఎదుర్కొనేంత సత్తా ఉండాలి. అదే వరుసగా ఫ్లాపులు పడితే మనుగడను కాపాడుకునేందుకు కష్టపడాలి. ఇలా చిత్రపరిశ్రమలో నానాసమస్యలను దాటుకుని స్టార్‌ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగాడు మారుతి. కేవలం రెండు రూపాయల జిలేబీ తిని కడుపు నింపుకున్న రోజుల నుంచి అరటి పండ్లు అమ్మిన రోడ్డుపై జాగ్వార్‌ కారులో తిరిగే స్థాయికి ఎదిగాడు. సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ ప్రారంభించిన మారుతి ఈ రోజుల్లో చిత్రంతో దర్శకుడిగా మారారు. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా సత్తా చాటుతున్న అతడు ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమా తీస్తున్నాడు.

తాజాగా అతడు తన భార్య వీరనాగ స్పందనతో కలిసి ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ తమ ప్రేమ విశేషాలను పంచుకున్నారు. స్పందన మాట్లాడుతూ.. 'మేమిద్దరం ఒకే స్కూల్‌లో చదువుకున్నాం. అతడు నా సీనియర్‌. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన ముఖం నచ్చింది. 9వ తరగతిలో టాలెంట్‌ నచ్చింది. పదవ తరగతికి వచ్చేసరికి తను వెళ్లిపోయాడు. ఆ తర్వాత కూడా మా ప్రేమ కొనసాగింది. ఆయన నన్ను కలుసుకునేందుకు ఆర్టీసీ బస్సులో వచ్చేవాడు, నేను స్కూటీపై వెళ్లేదాన్ని. ఇద్దరం దొంగతనంగా కలుసుకుని నా స్కూటీపై తిరిగేవాళ్లం' అని చెప్పుకొచ్చింది.

మారుతి మాట్లాడుతూ.. 'స్పందనకు డైరీ రాయడం అలవాటు. ఈ రోజు వచ్చాడు, ఇది జరిగిందని అన్నీ రాస్తుంది. తనను ఇంప్రెస్‌ చేయడానికి చేసిన వెధవ పనులన్నీ అందులో ఉంటాయి' అని పేర్కొన్నాడు. కాగా మారుతి జీవితంలో సెటిలయ్యాక ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్లి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు.

చదవండి: మెసేజ్‌ చేసినందుకు నేరుగా ఇంటికి వెళ్లిన డైరెక్టర్‌
గ్రాండ్‌గా బాలీవుడ్‌ నటి సీమంతం

మరిన్ని వార్తలు