దర్శకుడు ఎన్‌బీ చక్రవర్తి కన్నుమూత

8 Aug, 2020 08:16 IST|Sakshi

ప్రముఖ దర్శకుడు ఎన్‌బీ చక్రవర్తి కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శోభన్‌బాబుతో ‘సంపూర్ణ ప్రేమాయణం’, నందమూరి బాలకృష్ణతో ‘కత్తుల కొండయ్య’ చిత్రాలను తెరకెక్కించారు చక్రవర్తి. ఇంకా ‘నిప్పులాంటి మనిషి’, ‘కాష్మోరా’ వంటి చిత్రాలకూ దర్శకత్వం వహించారాయన. 1986లో వచ్చిన ‘కాష్మోరా’ చిత్రం మంచి విజయం సాధించింది. ‘‘చక్రవర్తిగారు చాలా సినిమాలకు కో డైరెక్టర్‌గా చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు కుమార్తెను ఆయన పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు అమ్మాయిలు, ఓ కుమారుడు.

మూసాపేటలోని తన నివాసంలో నిద్రలోనే హార్ట్‌ ఎటాక్‌తో చక్రవర్తిగారు మృతి చెందారు. శుక్రవారమే అంత్యక్రియలు పూర్తి చేశాం. జూనియర్స్‌కి కూడా ఎన్‌బీగారు ఎంతో సపోర్ట్‌గా ఉండేవారు. ఎవర్నీ హర్ట్‌ చేయకుండా మాట్లాడే మంచి గుణం ఆయనలో ఉంది. అలాంటి వ్యక్తి భౌతికంగా లేకపోవడం సినిమా పరిశ్రమకి తీరని లోటుగా భావిస్తున్నాం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అని తెలుగు చలన చిత్రదర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్‌. శంకర్‌ తెలిపారు. చక్రవర్తి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు