ఉద్యోగం వచ్చిందని ఏడ్చాను

27 Jan, 2021 08:16 IST|Sakshi

‘‘డైరెక్టర్‌ అవ్వాలనేది నా కల. నాకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జాబ్‌ వచ్చినప్పుడు ఇంట్లో ఆనందపడ్డారు. నేను మాత్రం డైరెక్టర్‌ అవుదామనుకుంటే ఇంజినీర్‌ని అయ్యానే అని ఏడ్చాను’’ అన్నారు ఫణి ప్రదీప్‌ (మున్నా). యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు, అమృతా అయ్యర్‌ జంటగా నటించిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ఎస్‌.వి. బాబు  నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. చిత్రదర్శకుడు ఫణి ప్రదీప్‌ (మున్నా) విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2011లో ఇంజినీర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశాను. సుకుమార్‌గారి దగ్గర ‘ఆర్య 2’, ‘1.. నేనొక్కడినే, 100 పర్సెంట్‌ లవ్‌’ చిత్రాలకు రచయితల విభాగంలో చేశాను. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, హిట్‌ అయిన ‘నువ్వేకావాలి, ఆనందం, నువ్వు నేను, క్షణం, స్వామిరారా’ సినిమాల స్ఫూర్తితో ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ కథ రాశాను.

ఈ కథని నిర్మాత ‘బన్నీ’ వాసుగారికి చెబితే, ఆయన దగ్గరుండి స్క్రీన్‌ప్లే రాయించారు. గీతా ఆర్ట్స్‌లో చేయాల్సింది కానీ, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. నా కజిన్, నటుడు భద్రం ద్వారా ఎస్వీ బాబుగారిని కలిశాను. ఆయనకు కథ నచ్చడంతో నిర్మించారు. మా అమ్మ, నా భార్య హీరోగా ప్రదీప్‌ అయితే బాగుంటాడు? అనడంతో నిర్మాతగారికి చెప్పడంతో ఓకే అన్నారు. సినిమా చూసిన ‘బన్నీ’ వాసుగారు మా బ్యానర్‌లో విడుదల చేస్తాం అన్నారు. ప్రస్తుతం రెండు పెద్ద బ్యానర్లలో అవకాశం వచ్చింది’’ అన్నారు.  

మరిన్ని వార్తలు