Sayaji Shinde: ఆ నటుడు నన్ను మోసం చేశాడు.. నిర్మాత సంచలన ఆరోపణలు

8 Dec, 2022 19:41 IST|Sakshi

ప్రముఖ నటుడు షాయాజీ షిండే టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించారు. పోకిరి సినిమాలో పోలీస్ పాత్రలో ఆ డైలాగ్‌ ఆయనకు మరింత ఫేమ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో నటించారు. టాలీవుడ్‌లో సోలో, సీమ టపాకాయ్, యముడికి మొగుడు, సుడిగాడుతో సహా పలు చిత్రాల్లో కనిపించారు. తాజాగా ఆయనపై మరాఠీ చిత్రనిర్మాత సచిన్ ససన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సినిమా నుంచి తప్పుకుని తనను మోసం చేశారని ఆయన ఆరోపించారు. 

అసలేం జరిగిందంటే..: అయితే మరాఠీ చిత్రనిర్మాత సచిన్ ససన్ తెరకెక్కిస్తున్న గిన్నాద్ మూవీలో నటించేందుకు రూ.5 లక్షలకు షాయాజి షిండే సంతకం చేశారు. నిర్మాత నుంచి డబ్బులు కూడా తీసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. నవంబర్ 25, 26 తేదీల్లో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. షాయాజి షిండే అందుబాటులో లేరని నిర్మాత అన్నారు. 

ఆ తర్వాత 27న షూటింగ్ రోజు స్క్రిప్ట్ మార్చమని షాయాజీ కోరడంతో ఆశ్చర్యపోయానని చిత్ర నిర్మాత వెల్లడించారు. నిర్మాత అందుకు ఒప్పుకోకపోవడంతోఆగ్రహించిన షాయాజి సినిమా నుంచి తప్పుకున్నారు. షూటింగ్ ఆగిపోవడంతో చిత్రనిర్మాత సచిన్ తన ఫీజును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగినందుకు పారితోషికం రూ. 5 లక్షలతో పాటు అన్ని ఖర్చులు భరించి మొత్తం రూ.17 లక్షలు చెల్లించాలని నిర్మాత కోరారు.

మరిన్ని వార్తలు