రణ్‌వీర్‌ సింగ్‌తో శంకర్‌ భారీ స్కెచ్‌

14 Apr, 2021 14:43 IST|Sakshi

ప్రముఖ దర్శకుడు శంకర్‌, బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ కలయికలో ఓ చిత్రం రాబోతుందని గత కొద్దిరోజులుగా గుసగుసలు వినబడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై శంకర్‌ అఫిషియల్‌గా అనౌన్స్‌ చేశాడు. తన కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయిన ‘అపరిచితుడు’ మూవీని హిందీలో రీమేక్‌ చేయబోతున్నానని ప్రకటించారు. ‘ఈ సమయంలో నా కంటే ఆనందంగా ఉండే వ్యక్తి మరొకరు ఉండరు. రణ్‌వీర్‌ సింగ్‌తో సూపర్‌ హిట్‌ చిత్రం ‘అన్నియన్‌’ రీమేక్‌ని తెరకెక్కిస్తుండటం గొప్ప అనుభూతిని పంచుతోంది’ అని శంకర్‌ ట్వీట్‌ చేశాడు. 

కాగా, 2005లో విక్రమ్‌ హీరోగా తమిళం ‘అన్నియన్‌’, తెలుగులో ‘అపరిచితుడు’గా వచ్చిన సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో శంకర్‌ దశ మారిపోయింది. ఈ మూవీ తర్వాత తెలుగులో కూడా శంకర్‌కు మంచి మార్కెట్‌ ఏర్పడింది. ఇదే సినిమాని హిందీలో కూడా విడుదల చేశారు కానీ, అక్కడ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ‘అపరిచితుడు’ని బాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయడం చేయనున్నాడు.

పాత్ర పాతదే అయినప్పటీకి కథలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కొత్త తరహా కథలో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. పెన్ మూవీస్ బ్యానర్‌పై జయంతిలాల్ నిర్మించబోతున్న ఈ సినిమా షూటింగ్‌ 2022 లో ప్రారంభం కాబోతున్నట్లు శంకర్‌ ప్రకటించాడు. 2023లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇదిలా  ఉంటే.. శంకర్‌ ప్రస్తుతం కమల్‌హాసన్‌ ‘ఇండియన్‌ 2’తో పాటు రామ్‌ చరణ్‌తో చేయనున్న మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాతే ‘అన్నియన్‌’ హిందీ రీమేక్‌ ప్రారంభించనున్నాడు.

మరిన్ని వార్తలు