Suriya-Shankar: రూ.వెయ్యి కోట్లతో  శంకర్, సూర్య కాంబోలో చిత్రం?

11 Nov, 2022 09:57 IST|Sakshi

ఇప్పుడు చారిత్రక కథా చిత్రాల ట్రెండ్‌ నడుస్తోందని చెప్పవచ్చు. ఇలాంటి చిత్రాలు వచ్చి చాలా కాలం అయ్యింది. ఆ తరువాత టాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు రాజమౌళి ఆ తరహా చిత్రాలకు ఊతమిచ్చారని చెప్పవచ్చు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలే ఇందుకు ఉదాహరణ. తాజాగా మణిరత్నం పొన్నియిన్‌ సెల్వన్‌ వంటి భారీ చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్‌ అయ్యారు. ఈ చిత్రాన్ని రూపొందించడానికి దర్శకుడు రాజమౌళినే స్ఫూర్తి అని మణిరత్నం స్వయంగా పేర్కొన్నారు.

కాగా ఇప్పుడు ఈ దర్శకుల వరుసలో మరో స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ చేరనున్నట్లు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికే బ్రహ్మాండ చిత్రాలకు కేరాఫ్‌ శంకర్‌ అనే ముద్ర వేసుకున్నారాయన. ప్రస్తుతం కమలహాసన్‌ కథా నాయకుడిగా ఇండియన్‌ –2, అలాగే టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌తో ఒక భారీ చిత్రాన్ని చేస్తూ బిజీగా ఉన్న శంకర్‌ తదుపరి ఒక చారిత్రక కథా చిత్రాన్ని హ్యాండిల్‌ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇందులో నటుడు సూర్య కథానాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. వేల్పారి అనే చారిత్రక కథా చిత్రాన్ని రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కించడానికి శంకర్‌ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మదురై పార్లమెంట్‌ సభ్యుడు ఎస్‌.వెంకటేశన్‌ రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని, దీనికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. చేర, చోళ, పాండియన్‌ రాజుల తరువాత తరం రాజైన నేర్పాలి. రాజు ఇతివృత్తమే శంకర్‌ దర్శకత్వం వహించనున్నారని టాక్‌. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. 

మరిన్ని వార్తలు