ప్రేమ పెళ్లి: దారుణంగా హింసించేవాడు..

8 Dec, 2020 17:02 IST|Sakshi
కుటుంబ సభ్యులతో దివ్యా భట్నాగర్‌

దివ్యా భట్నాగర్‌ భర్తపై సోదరుడి ఆరోపణలు

ముంబై: ‘‘గగన్‌.. దివ్యను మానసికంగా, శారీరకంగా దారుణంగా హింసించాడు. పెళ్లైన కొన్ని రోజులకే తనకు నరకం చూపించేవాడు. భర్త తనను వేధించిన విధానం గురించి దివ్య నవంబరు 7న ఓ నోట్‌ రాసింది. నిన్న తన కబోర్డు తెరచి చూడగా అది మా కంటపడింది. నిజానికి తను పోలీసులను కూడా ఆశ్రయించింది. నవంబరు 16న ఫిర్యాదు చేసింది. గృహహింస కేసు పెట్టాలనుకుంది. తను ఆస్పత్రిలో ఉన్నపుడు నేను చూడటానికి వెళ్లాను. ఈ విషయాలను నాతో పంచుకుంది. తనను కాపాడుకోలేకపోయాం’’ అని దివంగత టీవీ నటి దివ్యా భట్నాగర్‌ సోదరుడు దేవాశిష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. భర్త గగన్‌ కారణంగా తన సోదరి ఎన్నో ఇబ్బందులు పడిందని, తనను పట్టించుకోనందు వల్లే ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించాడు.(చదవండి: తన బంగారాన్ని దొంగిలించాడు: నటి)

కాగా ‘యే రిష్తా క్యా కెహలాతా హై’, ‘సంస్కార్’, ‘ఉడాన్’, ‘జీత్‌ గయి తో పియా మోరే’ వంటి హిందీ సిరీయల్స్‌లో నటించిన దివ్య(34) కరోనాతో సోమవారం కన్నుమూసిన విషయం విదితమే. దీంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ క్రమంలో దివ్య భర్త గగన్‌ గబ్రూ నిర్లక్ష్యమే ఆమె మరణానికి కారణమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన తల్లిదండ్రులను ఎదిరించి మరీ దివ్య ఏడాది క్రితం గగన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా భర్తతో కలిసి ఉంటున్న క్రమంలో ఆమెకు ఇటీవలే కోవిడ్‌ సోకింది. దీంతో అతడు ఆమెను వదిలేసి దూరంగా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులే ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించినట్లు సన్నిహితులు వెల్లడించారు. ఇక దివ్య బెస్ట్‌ ఫ్రెండ్‌, నటి దేవోలినా భట్టాచార్య సైతం గగన్‌ గబ్రుపై ఇదే రకమైన ఆరోపణలు చేశారు. దివ్య కుటుంబం, స్నేహితుల గురించి మాట్లాడే అర్హత తనకు లేదంటూ ఫైర్‌ అయిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు