పద్దతి బాలేదంటూ యంగ్‌ హీరోకు నో చెప్పిన నిర్మాత

16 Apr, 2021 20:22 IST|Sakshi

బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తను ప్రధాన పాత్రలో నటిస్తున్న 'దోస్తానా 2' సినిమా నుంచి అతడిని తప్పించినట్లు తెలుస్తోంది. ఈ వార్త అతడి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ సగం పూర్తైంది. అయితే కార్తీక్‌ పద్దతేమీ బాగోలేదని, అతడి ప్రవర్తన అనైతికంగా ఉండటంతో కరణ్‌ జోహార్‌ ఆ హీరోను అర్ధాంతరంగా తొలగించాడని అంటున్నారు. అంతేకాదు భవిష్యత్తులోనూ అతడితో సినిమాలు తీయకూడదని కరణ్‌ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి.

అసలు కరోనా సమయంలో షూటింగే కష్టమంటే.. ఇప్పుడు సగం పూర్తైన సినిమాలో మరో కొత్త హీరోను తీసుకుని మళ్లీ మొదటి నుంచి షూటింగ్‌ మొదలు పెట్టడం తలకు మించిన భారంగా మారనుంది. అయినప్పటికీ హీరోను రీప్లేస్‌ చేయడానికే ధర్మ ప్రొడక్షన్స్‌ నిర్ణయించుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన సైతం జారీ చేసింది. కాగా 2008లో వచ్చిన సూపర్‌ హిట్‌ సినిమా దోస్తానాకు సీక్వెల్‌గా వస్తోందీ చిత్రం. ఇందులో కార్తీక్‌ ఆర్యన్‌, జాన్వీ కపూర్‌ నటిస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. 2019 నవంబర్‌లోనే షూటింగ్‌ కూడా మొదలు పెట్టారు. కానీ గతేడాది లాక్‌డౌన్‌ వల్ల చిత్రీకరణ వాయిదా పడింది. గత రెండు వారాలుగా షూటింగ్‌ జరుపుకుంటున్నప్పటికీ సడన్‌గా హీరో సైడ్‌ అయిపోవడం హాట్‌ టాపిక్‌గా మారింది.

అయితే బేధాభిప్రాయాల వల్ల కార్తీకే ఈ సినిమా నుంచి వైదొలగాడన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో మాత్రం నెటిజన్లు కార్తీక్‌ను దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో పోల్చుతున్నారు. సినిమా అవకాశాలు ఇచ్చినట్లే ఇచ్చి చేజార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టార్‌ కిడ్స్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టరు కానీ ఇలా అవుట్‌సైడర్స్‌(సినీ రంగానికి చెందనివారు)ను మాత్రం ఆ లిస్టులో చేరుస్తారని నిప్పులు చెరుగుతున్నారు.

చదవండి: లంబోర్గిని కారు కొన్న కుర్ర హీరో, ధర ఎంతంటే?

మరిన్ని వార్తలు