చుక్కలు చూపిస్తున్న కరోనా.. అక్కడికి వెళ్లిపోయిన నటి

17 Apr, 2021 11:12 IST|Sakshi

కరోనా వచ్చిన పేషెంట్‌ ఇంట్లో ఉంటే ఒక విడి గది ఇచ్చే వీలు లేని సామాన్యులు కోట్లాదిమంది ఉన్నారు. అదే సమయంలో కరోనా నుంచి రక్షించుకోవడానికి నగరాలకు దూరంగా వెళ్లే సెలబ్రిటీలు ఉన్నారు. కరోనా వార్తలు గత సంవత్సరం వచ్చిన వెంటనే నటి నీనా గుప్తా నైనిటాల్‌కు సమీపంగా ఉండే ముక్తేశ్వర్‌లోని తన విడిది గృహానికి షిఫ్ట్‌ అయ్యింది. అక్కడే ఉండి తగ్గాక వచ్చింది. ఇప్పుడు మళ్లీ కరోనా ఉధృతం కాగానే ఆమె ముక్తేశ్వర్‌లో ప్రత్యక్షమయ్యారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ బాలీవుడ్‌కు చుక్కలు చూపిస్తోంది. తాజాగా విలన్‌ అశుతోష్‌ రాణాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇంకా ఎంతమందికి రానుందో తెలియదు. ముంబై ఏమాత్రం సేఫ్‌ కాదని తెలిసిన చాలామంది ఫామ్‌హౌస్‌ల బాట పట్టారు. నటుడు సల్మాన్‌ ఖాన్‌ గత సంవత్సరం నుంచి దాదాపుగా తన పాన్వెల్‌ ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నారు. కరోనా నుంచి రక్షణ పొందడానికి నటి నీనా గుప్తా కూడా గత సంవత్సరం ముక్తేశ్వర్‌ లో ఉన్న తన విడిదింటికి వెళ్లిపోయారు. అక్కడే ఏడెనిమిది నెలలు ఉన్నారు. ఆ తర్వాత ముంబైకి తిరిగి వచ్చినా ప్రస్తుత పరిస్థితి దృష్టా మళ్లీ ముక్తేశ్వర్‌ చేరుకున్నారు.

ముక్తేశ్వర్‌ నైనిటాల్‌కు సమీపంగా ఉండే గొప్ప టూరిస్ట్‌ స్పాట్‌. ప్రశాంతంగా ఉండే పర్వత ప్రాంతం. ‘ఇక్కడి ప్రజలు, వాతావరణం ప్రశాంతంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఉతికిన గుడ్డలను బయట ఆరవేయడం వారికి నచ్చదు. బట్టలు బాగా ఎండకు ఆరితే తప్ప నాకు అవి ఆరినట్టుగా అనిపించదు. అయినా బట్టలు ఉతికి ఆరేస్తేనే కదా అది ఇల్లు అనే భావన వస్తుంది’ అని నీనా గుప్తా ముక్తేశ్వర్‌లో తన విడిదింటి నుంచి తాజా వీడియోలో పేర్కొంది. నీనా గుప్తా కుమార్తె మసాబా ఫ్యాషన్‌ రంగంలో పని చేస్తోంది. తల్లీకూతుళ్లు కలిసి నటిస్తున్నారు కూడా. అయినా ఆ పనులకు బ్రేక్‌ ఇచ్చి సురక్షితంగా ఉండాలి అని నీనా భావిస్తున్నందుకు ఆమెను అభినందించాలి. ఆమె స్టే బాగా గడవాలని కోరుకుందాం.

చదవండి: అమితాబ్‌కి భార్యగా..'నా కల నెరవేరింది'
ఆసక్తికర విషయాలు వెల్లడించిన నీనా గుప్తా

మరిన్ని వార్తలు