డేవిడ్ వార్న‌ర్‌పై ఈషా రెబ్బా ట్వీట్‌

26 Apr, 2021 19:16 IST|Sakshi

ఐపీఎల్ 2021 సీజ‌న్‌లో 14లో ఆదివారం రాత్రి చెన్నై వేదిక‌గా జ‌రిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. తొలుత హైదరాబాద్‌, ఢిల్లీ జట్లు నిర్ణీత 20 ఓవర్లలో సరిసమానంగా 159 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టై అయ్యింది. దీంతో ఈ సీజ‌న్‌లో తొలిసారి ఈ సీజ‌న్‌లో సూప‌ర్ ఓవ‌ర్ అవ‌రమొచ్చింది.  ఈ సూప‌ర్ ఓవర్లో హైదరాబాద్‌పై ఢిల్లీ ఉత్కంఠ విజయం సాధించింది. సూపర్ ఓవర్‌‌లో కేన్ విలియమ్సన్‌తో కలిసి బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ డేవిడ్ వార్నర్.. మూడు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు మాత్రమే చేశాడు. చివరి బంతికి వార్నర్ డబుల్ తీసినా.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో క్రీజు లోపల వార్నర్ బ్యాట్ ఉంచలేదని చెప్పిన అంపైర్ షార్ట్ రన్ తప్పిదం కింద ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. దాంతో ఢిల్లీ టార్గెట్ 9 పరుగుల నుంచి 8 పరుగులకి తగ్గింది.

సూపర్ ఓవర్‌‌లో రషీద్ ఖాన్ ధీటుగా బౌలింగ్ చేయడంతో కాస్తా ఢిల్లీ తడబడింది. కానీ ఆఖరి బంతికి సింగిల్ తీసి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఒకవేళ షార్ట్ రన్ పరుగు కూడా ఉండుంటే.. మ్యాచ్ మరో సూపర్ ఓవర్‌కి వెళ్లేది. అప్పుడు హైదరాబాద్ గెలిచే అవకాశం ఉండేది. అయితే జానీ బెయిర్‌స్టో లాంటి పవర్ హిట్టర్ ఉండగా.. కేన్ విలియమ్సన్‌తో కలిసి డేవిడ్ వార్నర్ సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కి వెళ్లడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 

మరోవైపు వార్నర్ తప్పిదం కారణంగానే సూపర్ ఓవర్‌లో ఢిల్లీ గెలిచిందంటూ ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ కూడా చేరారు. " వార్నర్ అన్నా ఏందిది..?ఎందుకు నువ్వు వచ్చావ్ ? బెయిర్ స్టోని లేదా సుచిత్ ను పంపొచ్చుగా..నీకు టీమ్ నిర్మించుకోవాలనుకుంటే డ్రీమ్ లెవెన్ లో ఆ పని చెయ్యి " అంటూ ట్వీట్ చేసింది ఈషా. 

మరిన్ని వార్తలు