The Elephant Whisperers: ఆస్కార్ గెలిచిన రోజే ఏనుగులు మిస్సింగ్

14 Mar, 2023 17:00 IST|Sakshi

లాస్‌ ఎంజిల్స్‌లో జరిగిన ఆస్కార్ అవార్డు గెలిచిన డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్​ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'​. పూర్తిగా ఇండియాలో నిర్మించిన డాక్యుమెంటరీకి తొలి ఆస్కార్‌ దక్కడం విశేషం. వీరికి ఈ అవార్డు రావడానికి కారణం రఘు, అమ్ము అనే అనాథ ఏనుగు పిల్లలు. ఆ ఏనుగు పిల్లను చేరదీసిన ఆదివాసి దంపతులు బొమ్మన్, బెల్లి. కరెంటు తీగలు తగిలి తల్లి ఏనుగులు మరణించడంతో బొమ్మన్, బెల్లిలు రఘుని, అమ్ముని సాకుతారు. మనుషులకు అడవి జంతువులకు మధ్య ఉండే అనుబంధాన్ని ఈ డాక్యుమెంటరీలో ఎంతో అద్భుతంగా చూపించారు. అయితే అవార్డ్ ప్రదానోత్సవం రోజునే విచిత్ర సంఘటన జరిగింది. 

ఒకవైపు అవార్డ్ వచ్చిందన్న ఆనందంలో ఉంటే.. మరోవైపు ఆ డాక్యుమెంటరీలో నటించిన ఏనుగులు అదృశ్యమయ్యాయనే వార్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డాక్యుమెంటరీలో రఘు, అమ్ము అనే రెండు ఏనుగులు అదృశ్యమైనట్లు బొమ్మన్  వెల్లడించారు. కొంతమంది తాగుబోతులు ఏనుగులను తరమడంతో ఆదివారం రెండు ఏనుగులు కృష్ణగిరి అరణ్యంలోకి వెళ్లిపోయాయని ఆయన చెప్పారు. ఆ ఏనుగుల కోసం బొమ్మన్ ప్రస్తుతం వెతుకడం ప్రారంభించారు. 

బొమ్మన్ మాట్లాడుతూ..'మద్యం మత్తులో ఉన్న కొంత మంది వ్యక్తులను తరమడంతో ఏనుగులు అడవిలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం నేను కృష్ణగిరి ఫారెస్ట్‌లో వెతుకుతున్నా. అవి రెండూ కలిసే ఉన్నాయా.. విడిపోయాయా అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాటి ఆచూకీ కనిపెట్టడానికి ప్రయత్నిస్తా. ఒకవేళ అవి నాకు కనిపించకపోతే ఫారెస్ట్ రేంజర్‌కు ఫిర్యాదు చేసి నేను నా సొంతూరికి వెళ్తా.' అని అన్నారు.

మరిన్ని వార్తలు