నవ్వులకు క్లాప్‌

18 Dec, 2020 00:42 IST|Sakshi
అల్లు అరవింద్, వరుణ్‌ తేజ్, తమన్నా

వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఎఫ్‌3’. గతేడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఎఫ్‌2’కి ఇది సీక్వెల్‌. గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ‘ఎఫ్‌3’ని ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి ఫైనాన్షియర్‌ ప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇచ్చారు. ‘దిల్‌’ రాజు గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా ‘ఎఫ్‌2’ చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. అన్నీ కుదిరితే ‘ఎఫ్‌3’ చిత్రాన్ని రూపొందిస్తామని అప్పుడే చెప్పాం. అప్పటినుండి దర్శకుడు అనిల్‌ ఈ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. డిసెంబర్‌ 23న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తాం’’ అన్నారు. అనిల్‌ మాట్లాడుతూ– ‘‘ఎఫ్‌2’కి మరింత వినోదాన్ని జోడించి ‘ఎఫ్‌3’ని రూపొందిస్తున్నాం. అద్భుతమైన కథ కుదిరింది. మా ఆర్టిస్టులు మరిన్ని నవ్వుల్లో ప్రేక్షకులను ముంచెత్తుతారు. రాజుగారి బ్యానర్‌లో మరోసారి వర్క్‌ చేయటం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సహనిర్మాత: హర్షిత్‌ రెడ్డి.
 

మరిన్ని వార్తలు