FAAS Awards 2023: సినీరంగంలోని ప్రముఖులకు అవార్డులివ్వనున్న ఫాస్‌..

6 May, 2023 15:44 IST|Sakshi

సినీ ప్రముఖులకు సిల్వర్ నంది పురస్కారాలు

ఉత్తమ సినీ జర్నలిస్టుగా రెంటాల జయదేవకు అవార్డ్

తెలుగు సినీ రంగంలోని ప్రతిభావంతులను ఎప్పటికప్పుడు గుర్తించి, అవార్డులిచ్చి అభినందించే ‘ఫిలిమ్ ఎనలిటికల్ అండ్ అప్రీసియేషన్ సొసైటీ’ (ఫాస్) తాజాగా మరోసారి అవార్డు ప్రదాన కార్యక్రమంతో ముందుకొచ్చింది. బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ ల్యాబ్‌లో మే 7న సాయంత్రం 6 గంటలకు ఈ అవార్డుల వేడుక జరగనుంది. ఫాస్ రజతోత్సవాల సందర్భంగా సినీ రంగానికి చెందిన వివిధ విభాగాలలోని విశిష్ట వ్యక్తులను ప్రత్యేక అవార్డుల కోసం ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో అక్కినేని – ఫాస్ సిల్వర్ జూబ్లీ, మహిళా సిల్వర్ పీకాక్ సినీ అవార్డులు, దాసరి – ఫాస్ సిల్వర్ జూబ్లీ సిల్వర్ నంది సినీ అవార్డులు, ఫాస్ – ఎన్టీఆర్ సెంటినరీ సిల్వర్ క్రౌన్ అవార్డు, జీవన సాఫల్య పురస్కారాలను అందజేయనున్నారు.

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మురళీమోహన్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ముప్ఫై ఏళ్ళుగా తెలుగు చలనచిత్ర రంగానికి సేవలందిస్తున్న వారికి అవార్డులతో పాటు రజత కిరీటాలను ఇచ్చి గౌరవించనున్నారు. సాఫల్య పురస్కార గ్రహీతల్లో నటి రోజారమణి, రచయితలు పరుచూరి బ్రదర్స్, నిర్మాత సి. కల్యాణ్, దర్శకుడు రేలంగి నరసింహారావు తదితరులు ఉన్నారు. మూడున్నర దశాబ్దాలుగా పత్రికారంగంలో కృషి చేస్తున్న డాక్టర్ రెంటాల జయదేవను ఉత్తమ సినీ జర్నలిస్టుగా ఎంపిక చేశారు.

పలువురు సినీ, మీడియా సంస్థలు, ప్రముఖులకు ఇంకా అనేక అవార్డులను వేదికపై అందించనున్నారు. లాభాపేక్ష రహితంగా, ఉన్నత విలువలతో సినీరంగానికి మూడు దశాబ్దాలుగా సేవ చేస్తున్న ఫాస్ సంస్థ చేస్తున్న ఈ కార్యక్రమంలో అవార్డు విజేతలతో పాటు పలువురు సినీ, సాంస్కృతిక, సామాజిక ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ వేడుకకు అందరూ ఆహ్వానితులేనని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, సెన్సార్ బోర్డ్ మాజీ సభ్యుడు ‘సాంస్కృతిక రత్న’ కె. ధర్మారావు తెలిపారు.

చదవండి: ఇంటి గడప దాటడానికి కూడా పోరాటం చేయాల్సి వస్తోంది

మరిన్ని వార్తలు