చూపు తిప్పుకోకుండా 'కాంతారా' చూశాను: అల్లు అరవింద్‌ 

11 Oct, 2022 22:49 IST|Sakshi
అల్లు అరవింద్, రిషబ్‌ శెట్టి, సప్తమి 

‘‘హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలు తీస్తోంది. ‘కాంతారా’ సినిమా చూసిన తర్వాత ఇన్ని సినిమాలు తీసిన నేను కూడా వారి దగ్గర నుంచి కొంత నేర్చుకోవాలని అనిపించింది. విభిన్నమైన సినిమాలు కావాలనుకునేవారికి ‘కాంతారా’ కచ్చితంగా నచ్చుతుంది’’ అని అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. కన్నడ నటుడు, రచయిత, దర్శకుడు రిషబ్‌ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతారా’. ఈ చిత్రంలో సప్తమి గౌడ, కిశోర్‌ కుమార్, అచ్యుత్‌ కుమార్, ప్రమోద్‌ శెట్టి, ప్రకాష్‌ తుమినాడు కీలక పాత్రలు పోషించారు. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 30న విడుదలైంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ గీతా ఫిలింస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా ఈ నెల 15న రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ – ‘‘అడవి నేపథ్యంలో వచ్చిన ‘పుష్ప’ చూసి ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడ్డారో.. అదే నేపథ్యంలో వస్తున్న ‘కాంతారా’ను కూడా అంతే ఇష్టపడతారు. ‘కాంతారా’లో ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ మాత్రమే కాదు.. విష్ణు తత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. రీసెంట్‌గా వచ్చిన ఈ తరహా సినిమాలు సూపర్‌ హిట్టయ్యాయి. ‘కాంతారా’ను రిషబ్‌ శెట్టి ఎంత అద్భుతంగా డైరెక్ట్‌ చేశారో అంతే బాగా యాక్ట్‌ చేశారు. సుమారు 40 నిమిషాల వరకు చూపు తిప్పుకోకుండా ఈ సినిమాను చూశాను. హీరోయిన్‌ సప్తమి డీ గ్లామరస్‌ రోల్‌ను బాగా చేసింది’’ అని అన్నారు.

రిషబ్‌ శెట్టి మాట్లాడుతూ– ‘‘భారతీయ చిత్ర పరిశ్రమలోనే తెలుగు చలన చిత్ర పరిశ్రమ అగ్రస్థానంలో ఉంది. ఫారెస్ట్‌ మిస్టరీతో పాటు అగ్రికల్చర్‌ ల్యాండ్, ఎమోషన్స్‌ చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. యూనివర్సల్‌ కథతో వస్తున్న ‘కాంతారా’ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెప్పగలను. అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌గారి గీతా ఫిలింస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా ‘కాంతారా’ రిలీజ్‌ అవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘రిషబ్‌ శెట్టితో నేను చేసిన మూడో సినిమా ఇది. ‘కాంతారా’లో ఆరు పాటలు రాసే అవకాశాన్ని ఇచ్చిన హనుమాన్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు రచయిత రాంబాబు గోశాల.   

మరిన్ని వార్తలు