Mani Ratnam : గుర్రం మృతి.. మణిరత్నంపై కేసు నమోదు

3 Sep, 2021 11:25 IST|Sakshi

FIR against Mani Ratnam: ప్రముఖ దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదైంది. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న  'పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రీకరణలో ఓ గుర్రం చనిపోవడంతో పెటా ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో గుర్రం యజమాని, మణిరత్నంలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. గత నెలలో హైదరాబాద్‌ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో గత నెల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే సినిమా షూటింగ్‌ జరుగింది. 

యుద్ధం సీన్‌ కోసం ఏకధాటిగా షూటింగ్‌ చేయడంతో డీహైడ్రేష‌న్‌ కారణంగా ఓ గుర్రం చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పెటా ప్రతినిథులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు మ‌ణిర‌త్నంతో పాటు సినిమా నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యాన‌ర్, గుర్రం య‌జ‌మానిపై పిసిఎ చట్టం 1960, సెక్షన్ 11 మరియు భారతీయ శిక్షాస్మృతి 1860 సెక్షన్ 429 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

కాగా ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి వ్రాసిన తమిళ హిస్టారికల్ ఫిక్షనల్ నవల "పోన్నియన్ సెల్వన్" కథ ఆధారంగా ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్, విక్రమ్, జయం రవి, త్రిష, కార్తి వంటి స్టార్ కాస్టింగ్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

చదవండి : సినిమా షూటింగ్‌లో దారుణం: గుర్రాన్ని చంపేసి... గుట్టుగా పూడ్చేసి 
RC 15:  మరో వివాదంలో డైరెక్టర్‌ శంకర్‌..

మరిన్ని వార్తలు