అనురాగ్‌ కశ్యప్‌పై కేసు నమోదు

23 Sep, 2020 15:20 IST|Sakshi

లైంగిక దాడి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌ముఖ‌ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ కశ్య‌ప్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. నటి పాయల్‌ ఘోష్‌ ఫిర్యాదు మేరకు ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేష‌న్‌లో కేసు నమోదు చేసిన‌ట్టు ఉన్న‌తాధికారి ఒక‌రు తెలిపారు. మంగ‌ళ‌వారం రాత్రి న‌టి పాయ‌ల్ ఘోష్ త‌న లాయ‌ర్ నితిన్ సాత్పుటేతో క‌లిసి పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన‌ట్టు పేర్కొన్నారు. ఐపీసీ సెక్ష‌న్ 376 (ఐ), 354, 341, 342 సెక్ష‌న్ల కింద అనురాగ్ కశ్య‌ప్‌పై కేసు న‌మోదయ్యింది. ఈ కేసులో త‌దుప‌రి ద‌ర్యాప్తు కొన‌సాగుతుంది. 2013లో వెర్సోవాలోని యారి రోడ్డులో కశ్య‌ప్ త‌న‌పై అత్యాచారం చేశారని న‌టి పాయ‌ల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణలో భాగంగా అనురాగ్ కశ్య‌ప్‌ని ప్ర‌శ్నించనున్న‌ట్టు స‌ద‌రు అధికారి తెలిపారు. 

మొద‌ట పాయ‌ల్ త‌న లాయ‌ర్‌తో క‌లిసి ఒషివారా పోలీస్ స్టేష‌న్‌కు వెళ్ల‌గా.. ఈ ఘ‌ట‌న వెర్సోవా పీఎస్ ప‌రిధిలో జ‌రిగినందు వ‌ల్ల అక్క‌డే ఫిర్యాదు చేయాల‌ని పోలీసులు సూచించారు. వెర్సోవాలో ఘ‌ట‌న జ‌రిగింద‌ని చెప్తుండ‌గా.. అనురాగ్ కశ్య‌ప్ ఆఫీస్ ఒషివారా ప‌రిధిలో ఉంది. ఇక ఈ ఆరోపణలు అనురాగ్‌ కశ్యప్‌ కొట్టి పారేసిన సంగతి తెలిసిందే. ఆయన మాజీ భార్యతో సహా పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు అనురాగ్‌కు మద్దతు తెలుపుతున్నారు. (చదవండి: ఈ చెత్తలోకి నన్ను లాగొద్దు: నటి ఫైర్)

మరిన్ని వార్తలు