ప్రభాస్‌ ‘ఆదిపురుష్’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

2 Feb, 2021 20:13 IST|Sakshi

ప్రమాద సమయంలో స్పాట్‌లో లేని ప్రభాస్‌, సైఫ్ అలీఖాన్‌

సినిమా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సురక్షితం

యంగ్‌రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌లో భారీ‌ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో ‘ఆదిపురుష్’ కోసం భారీ సెట్ వేశారు. మంగళవారం సాయంత్రం అక్కడ మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. దీంతో మూవీ యూనిట్ ఊపిరి పీల్చుకుంది. అయితే విజువల్స్ బట్టి చూస్తే షూటింగ్ సెట్ పూర్తిగా దగ్ధం అయినట్లు తెలుస్తోంది.
 

మంటలను అదుపుచేయడానికి 8 ఫైర్ ఇంజిన్లు, 5 జంబో ట్యాంకర్లు, ఒక వాటర్ ట్యాంకర్, జేసీబీ రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సెట్స్‌లో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లేరని చిత్ర యూనిట్‌కు చెందిన ఒకరు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

కాగా, ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం షూటింగ్ ప్రారంభమైనట్టు మంగళవారం ఉదయం ప్రభాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, షూటింగ్‌ మొదలైన తొలిరోజే ‘ఆదిపురుష్’ సెట్స్‌లో అగ్నిప్రమాదం జరగడం పట్ల ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.

మరిన్ని వార్తలు