విలన్‌ గా నన్ను చూడరేమో!

11 Mar, 2021 03:01 IST|Sakshi

‘‘ఒకప్పుడు కథల కోసం నేను పరుగులు పెట్టాను. ఇప్పుడు మంచి కథలు నా దగ్గరకు వస్తున్నాయి. నేను విభిన్నమైన సినిమాలను ఎంచుకోవడం వల్ల కాదు.. నేను ఎంచుకున్న కథలను ప్రేక్షకులు ఆదరించడం వల్ల ఈ స్థాయిలో ఉన్నాను’’ అన్నారు శ్రీవిష్ణు. అనీష్‌ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్‌ హీరో హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘గాలి సంపత్‌’. అనిల్‌ రావిపూడి సమర్పణలో ఎస్‌. కృష్ణ, సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.

శ్రీ విష్ణు మాట్లాడుతూ – ‘‘గతంలో వచ్చిన నా సినిమాలు కొన్నింటికి అనిల్‌ రావిపూడిగారు సపోర్ట్‌ చేశారు. ఓ సందర్భంలో ‘గాలిసంపత్‌’ కథ చెప్పారు. కథ నచ్చింది. ఈ కథను ఎస్‌.కృష్ణ రాశారని, అనీష్‌ డైరెక్ట్‌ చేస్తారని చెప్పారు. అలాగే నా తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్‌గారు ఉంటారని తెలిసింది. సాధారణంగా తండ్రి బాధ్యతగా ఉంటే... కొడుకు జులాయిగా ఉంటాడు. కానీ ఈ సినిమాలో కొడుకు బాధ్యతగా ఉంటే.. తండ్రి జులాయి అన్నమాట. రాజేంద్రప్రసాద్‌ గారితో వర్క్‌ చేయడం ఫుల్‌ హ్యాపీ. నెగటివ్‌ పాత్రల గురించిన ఆలోచన ఉంది. కానీ విలన్‌ గా నన్ను చూడరేమోనని అనుకుంటున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు