Gachibowli : గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు మృతి

18 Dec, 2021 08:49 IST|Sakshi

అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు

ప్రమాదంలో ముగ్గురు మృతి.. ఒకరికి తీవ్రగాయాలు

Gachibowli Road Accident: గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెళ్లిన కారు అదుపు తప్పి డివైడర్‌ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్తుండగా తెల్లవారుజామున 3.30గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు, కారు నడుపుతున్న ఓ బ్యాంకు ఉద్యోగి కూడా ఉన్నారు.

మృతులను ఎన్‌. మానస(23), ఎం. మానస(21)లుగా గుర్తించారు. వీరు అమీర్‌పేట్‌లోని హాస్టల్‌లో ఉంటున్నారు. కారు నడిపిన అబ్దుల్‌.. యాక్సిస్‌ బ్యాంకులో పనిచేస్తున్నారు. ఇతను విజయవాడ వాసిగా గుర్తించారు. సిద్ధు అనే మరో జూనియర్‌ ఆర్టిస్ట్‌కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

కాగా అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఉదయం షూటింగ్‌ ఉందని గచ్చిబౌలి జేవి కాలనిలో ఉండే సాయి సిద్దు ఇంటికి చేరుకున్నారు. అక్కడే నలుగురూ మద్యం తీసుకున్నట్లు సమాచారం. అనంతరం అర్థరాత్రి టీ తాగడానికి లింగంపల్లి వైపు వెళ్లగా కారు అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు