ఎవరు మీలో కోటీశ్వరులు? త్వరలో జెమినీ టీవీలో

7 Mar, 2021 15:54 IST|Sakshi

మెరుపు తీగలా వచ్చిపోయే షోలు కొన్నైతే ప్రేక్షకుల మదిలో ముద్రించుకుపోయే షోలు మరికొన్ని. మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా ఇదే కోవలోకి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో విజయవంతమైన ఈ షో హిందీలో కౌన్‌ బనేగా కరోడ్‌పతిగా ప్రసారమవుతోంది. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో అక్కడ సూపర్‌ సక్సెస్‌ సాధించింది. దీంతో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో దీన్ని తెలుగులోకి తీసుకొచ్చారు. టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో ఇక్కడ కూడా విజయవంతమైంది.

తాజాగా మరో కొత్త సీజన్‌ను ప్రారంభింబోతున్నారు. కాకపోతే ఈసారి జెమిని టీవీ షో పేరును కొంత మార్చి ఎవరు మీలో కోటీశ్వరులుతో ముందుకు వస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమోను రిలీజ్‌ చేసింది. 'సామాన్యుల జీవితాలను మార్చే గేమ్‌ షో, మీ ఆశలను నిజం చేసేందుకు జెమిని టీవీలో రాబోతోంది..' అంటూ వీడియో వదిలింది. కాగా ఈ సీజన్‌కు యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా రాబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన రంగంలోకి దిగితే టీఆర్పీలు ఆకాశాన్ని అంటడం ఖాయమని చెప్తున్నారు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌. ఈ షో ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: రానా: త్వరలోనే సీజన్‌-3 ప్రారంభం

మరిన్ని వార్తలు