ఫొటోషూట్‌కు వెళ్లిన ప్రముఖ మోడల్‌పై చిరుతల దాడి!

26 Aug, 2021 18:33 IST|Sakshi

జర్మనీకి చెందిన ప్రముఖ మోడల్‌పై రెండు చిరుత పులులు దాడి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తూర్పు జర్మనీలోని ఆటవీ ప్రాంతం సమీపంలో ఫొటోషూట్‌ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. సదరు మోడల్‌ పేరు జెస్సికా లీడోల్ఫ్‌(36). ప్రముఖ అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. తూర్పు జర్మనీ సాక్సోనీ-అన్హాల్ట్ రాష్ట్రంలో నెబ్రా అనే ప్రైవేటు స్థలంలో ఓ వ్యక్తి జంతువుల ప్రదర్శన కోసం రిటైర్‌మెంట్‌ హోంను నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో చిరుతలు ఉండే బోనుకు సమీపంలో జెస్సికా ఫొటోషూట్‌ తీసుకుంటుండగా రెండు చిరుతలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను హెలికాప్టర్‌ ద్వారా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించినట్లు స్థానిక పోలీసులు మీడియాతో పేర్కొన్నారు.

చదవండి: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ట్విస్ట్‌.. నోటీసులు రాలేదంటున్న నటులు!

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు సర్జరీ చేశారని పోలీసులు చెప్పినట్లు సదరు మీడియా వెల్లడించింది. అయితే తన తల, చెవులు, చెంపలపై చిరుతలు పదే పదే దాడి చేశాయని జెస్సికా స్థానిక మీడియాతో పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సదరు రిటైర్ట్‌ హోం యజమాని బిర్గిట్‌ స్టేచ్‌ను పోలీసులు కోరగా ఆయన మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో యజమానిపై కేసు నమోదు చేసి, ఈ హోంను అధికారికంగా నిర్వహిస్తున్నారా లేదా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. 

చదవండి: బిగ్‌బాస్‌ : అఫిషియల్‌ డేట్‌ వచ్చేసింది.. లిస్ట్‌ ఇదే!

మరిన్ని వార్తలు