Govind Padmasoorya: ఆయనతో నటించడం ఓ పాఠం

22 Jan, 2022 07:28 IST|Sakshi

‘‘హీరో, విలన్, కామెడీ.. ఎలాంటి పాత్రైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. విభిన్న పాత్రలు పోషిస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆశ’’ అన్నారు గోవింద్‌ పద్మసూర్య. మలయాళ చిత్రం ‘అడియాలంగళ్‌’లో హీరోగా నటించిన గోవింద్‌ తెలుగులో అల్లు అర్జున్‌ ‘అల.. వైకుంఠపురములో..’, ఇటీవల నాగార్జున ‘బంగార్రాజు’లో విలన్‌ పాత్రలు చేశారు.

ఈ సందర్భంగా శుక్రవారం విలేకర్ల సమావేశంలో గోవింద్‌ మాట్లాడుతూ – ‘‘మాది కేరళ. హీరోగా నా తొలి సినిమా ‘అడియాలంగళ్‌’కే బెస్ట్‌ యాక్టర్‌తో పాటు ఐదు స్టేట్‌ అవార్డ్స్‌ వచ్చాయి. ఆ తర్వాత మమ్ముట్టి, సురేష్‌ గోపీగార్లతో కూడా కలిసి నటించాను. తమిళంలో ‘కీ’ సినిమాలో నేను చేసిన విలన్‌ పాత్ర చూసి ‘అల.. వైకుంఠపురములో..’కి నన్ను త్రివిక్రమ్‌గారు తీసుకున్నారు.  ‘బంగార్రాజు’లో ఆది పాత్ర పోషించాను. నాగార్జునగారి వంటి గొప్ప నటుడితో నటించడం అంటే ఓ పాఠం వంటిది. నాగచైతన్య నాకు మంచి మిత్రుడైపోయాడు. ఈ చిత్రదర్శకుడు కల్యాణ్‌ కృష్ణగారి వల్లే ఆది పాత్రను బాగా చేయగలిగాను. ప్రస్తుతం హీరో నాని సోదరి దీప్తి దర్శకత్వం వహిస్తున్న వెబ్‌ ఆంథాలజీ ‘మీట్‌క్యూట్‌’లో ఓ కీలక పాత్ర, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో పోలీసాఫీసర్‌గా చేస్తున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు