సుకుమార్‌ చేతుల మీదుగా ‘గుమ్మడి నర్సయ్య’ టైటిల్‌ లోగో

30 Jul, 2021 18:16 IST|Sakshi

ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి, ఓ పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినా నిజాతీయికి నిలువుటద్దంలా రాజకీయ ప్రస్థానం సాగించారు సీపీఐ (ఎంఎల్) నేత గుమ్మడి నర్సయ్య. శాసనసభకు బస్సులో వచ్చే ఏకైక ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సయ్య నిరాడంబర జీవితం ఆదర్శనీయంగా మీడియా ప్రశంసించింది. ప్రజా జీవితంలోనే తన జీవితాన్ని చూసుకున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథతో సినిమా రూపొందుతోంది. పరమేశ్వర్ అనే కొత్త దర్శకుడు ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు.

తాజాగా గుమ్మడి నర్సయ్య బయోపిక్ టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. టైటిల్ లోగో విడుదల చేసిన అనంతరం దర్శకుడు సుకుమార్ చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలిపారు. ఒక ఆదర్శవంతమైన నాయకుడి గురించి ఈతరంతో పాటు రాబోయే తరాల ప్రజలకు, రాజకీయ నాయకులకు తెలిసేలా గుమ్మడి నర్సయ్య బయోపిక్ ఉండబోతోంది. ఈ సినిమాలో నటించే నటీనటులు, సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్ వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

మరిన్ని వార్తలు