Shaakuntalam: ఆ సినిమా చూశాకే సమంతను ఒకే చేశా: గుణశేఖర్

29 Mar, 2023 18:53 IST|Sakshi

సమంత తాజాగా నటించిన చిత్రం 'శాకుంతలం'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో దర్శకుడు గుణశేఖర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాను తెరకెక్కించేందుకు మూడేళ్ల సమయం పట్టిందని తెలిపారు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఈ చిత్రంలో శకుంతల పాత్రకు సమంతను ఎంపిక చేయలేదని అన్నారు. తన కూమార్తెనే సమంత పేరును సూచించిందని గుణశేఖర్ వెల్లడించారు. కథను ఎంచుకున్న తర్వాత పాత్రలపై చాలా రోజులు కసరత్తులు చేసినట్లు ఆయన తెలిపారు.  

 గుణశేఖర్ మాట్లాడుతూ .. 'ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకు సంవత్సర కాలం పట్టింది. షూటింగ్‌ కోసం ఆరు నెలల సమయం అనుకున్నాం. కానీ 81 రోజులు పట్టింది. ఆ తరువాత ఏడాదిన్నర పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాం. అలా ఈ సినిమాను సిద్ధం చేయడానికి నాకు మూడేళ్లు పట్టింది. అలాగే శకుంతలను కాళిదాసు ఎలా వర్ణించారనేది నేను చదివా. ఆ పాత్రకి ఎవరైతే బాగుంటుందని ఆలోచన చేశా. మొదట నేను సమంతను తీసుకోవాలని అనుకోలేదు. సమంత అయితేనే బాగుంటుందని  మా అమ్మాయి చెప్పింది. ఆ సమయంలో మరోసారి 'రంగస్థలం' చూశా. ఓ పాత్రలో సమంత ఎంతగా ఒదిగిపోతుందనేది నాకు అర్థమైంది. అప్పుడు ఆమెను సంప్రదించా.' అని  అన్నారు. దేవ్ మోహన్, సమంత నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న థియేటర్లలో సందడి చేయనుంది.

మరిన్ని వార్తలు