Rashmika Mandanna: టాలీవుడ్‌ టూ బాలీవుడ్‌ ‘నేషనల్‌ క్రష్‌’ జర్నీ

5 Apr, 2022 10:03 IST|Sakshi

ఎవరు పేరు చెబితే  ‘సామీ....నా సామీ అంటూ  చిన్నా పెద్దా అంతా  స్టెప్పులేస్తారో...ఆమే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ఛలో సినిమాతో  తెలుగు ఆడియెన్స్‌కు  పరిచయమై టాప్‌ హీరోయిన్‌గా హవాను చాటుకుంటూ ఫుల్ జోష్‌లో ఉంది రష్మిక.  టాలీవుడ్‌ , బాలీవుడ్‌లలో బిగ్ హీరోల బెస్ట్‌ ఆప్షన్‌గా,  నేషనల్‌ క్రష్‌గా పాపులర్‌ అయిన రష్మిక బర్త్‌డే  ఈరోజు. ఈ సందర్భంగా  హ్యాపీ బర్తడే  అంటూ ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు.  

కర్ణాటక రాష్ట్రం కొడుగు జిల్లా విరాజ్ పేట్‌‌లో 1996 ఏప్రిల్ 5న  జన్మించింది రష్మిక మందన్న. జర్నలిజం, సైకాలజీలో గ్రాడ్యుయేట్‌ అయిన రష్మిక ఇపుడు టాప్‌ హీరోయిన్‏గా దూసుకుపోతోంది. సినిమాల్లోకి రాకముందు పలు ప్రకటనల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.  2014లో రష్మికా మోడలింగ్ ప్రారంభించి, 2012లో ‘క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్‌ ఇండియా’ టైటిల్‌ను దక్కించుకుంది. అలా బ్యూటీ ఇండస్ట్రీలో సత్తా చాటి, హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది ఈ  క్రేజీ బ్యూటీ. ముఖ్యంగా తెలుగులో వెంకీ కుడుముల దర్శకత్వంలో తెర కెక్కిన ‘ఛలో’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలో సరైన హిట్‌ దక్కక పోయినా.. హీరోయిన్‌గా ఆడియెన్స్‌కు దగ్గరైంది. 

Pushpa's Heroine Rashmika Mandanna's 26th Birthday Special Story: క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటించిన గీతా గోవిందం సినిమాతో  రష్మిక టాప్ హీరోయిన్‏గా పేరు దక్కించుకుంది. ఇక ఆ తర్వాత  2019లో విజయ్‌ దేవరకొండతో మరోసారి జతకట్టి, డియర్ కామ్రేడ్ మూవీతో తన ఫ్యాన్స్‌ రేంజ్‌ను పెంచుకుంది. దీంతో రష్మికకు తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి.  దేవదాస్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.  ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్‌, రష్మికకు  సూపర్‌ స్టార్‌ మహేష్‌ సరసన తొలిసారి నటించే అవకాశాన్ని దక్కించుకున్న  ‘‘సరి లేరు నీకెవ్వరు’’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టింది. 

ఇక స్టయిలిష్‌ స్టార్ అల్లు అర్జున్,  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్  కాంబోలో  వచ్చిన ‘పుష్ప’  మూవీ  సంచలనం క్రియేట్‌ చేసింది.  ఈ చిత్రం తెలుగు, హిందీలోనూ రిలీజై బ్లాక్ బాస్టర్ హిట్‌ కావడంతో డీగ్లామర్‌ రోల్‌లో, శ్రీవల్లిగా రష్మిక క్రేజ్‌ మరింత పెరిగిపోయింది. ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొడుతూ ఎక్కడ చూసినా పుష్ప మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రఫ్‌ లుక్‌లో రష్మిక యాక్టింగ్‌కు తోడు సీమ యాసలో పుష్ప మూవీలో డైలాగ్స్‌ విపరీతంగా ఆకట్టు కున్నాయి. పుష్పలోని పాటలు సూపర్‌ డూపర్‌ హిట్టయ్యాయి. తెలుగులో ‘పుష్ఫ-2’ చిత్రంలోనూ రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే టాలెంటెడ్ హీరో శర్వానంద్.. డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్‏లో వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో కూడా రష్మిక ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అలాగే అర్జున్ రెడ్డి ఫేం దర్శకుడు సందీప్ రెడ్డివంగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించనుందట.

దివంగత కన్నడ ప వర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే కన్నడ చిత్రాలలో కూడా నటించడం విశేషం. అలాగే స్టార్‌ హీరోలతో జత కడుతూ మాంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక బీటౌన్‌ను కూడా ఆకర్షిస్తోంది.  స్టార్ హీరో సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను మూవీ ద్వారా రష్మిక బాలీవుడ్‏ఎంట్రీ  ఇచ్చింది. దీంతోపాటు సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సరసన ‘గుడ్ బై’ సినిమాలోనూ రష్మిక కీలక పాత్ర పోషిస్తోంది.

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ పక్కన చాన్స్‌ కొట్టేసిన రష్మిక ఫుల్‌ ఖుషీగా ఉన్నట్టు ఆమె సోషల్‌ మీడియా పోస్ట్‌లను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. అంతేకాదు బాలీవుడ్‌లో మూడో సినిమాకు కూడా కమిట్ అయినట్లు వెల్లడించిన రష్మిక  తగ్గేదే లే అంటోంది. ఈ ఏడాది కూడా మరిన్ని బ్లాక్‌ బస్టర్ హిట్స్‌ సాధించాలని కోరుకుంటూ ఫ్యాన్స్‌ అంతా హ్యాపీ బర్త్‌డే అని విష్‌ చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు