‘నువ్వంటే ఇష్టం... నాతో ఉండిపో’.. వివాహితకు సినీ కెమెరామెన్‌ వేధింపులు

22 Sep, 2022 17:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివాహితను వేధింపులకు గురిచేస్తున్న కెమెరామెన్‌పై బంజారాహిల్స్‌ పోలీసు­లు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. వివరాలివీ... యూసుఫ్‌గూడ సమీపంలోని నవోదయ కాలనీలో నివాసం ఉంటున్న కూనపరెడ్డి శ్రీనివాస్‌(49) సినీ పరిశ్రమలో కెమెరామెన్‌గా, యాడ్స్‌ డైరెక్టర్‌గా పనిచేస్తుంటాడు. పలు సినిమాలకు కెమెరామెన్‌గా పనిచేసిన శ్రీనివాస్‌ ఇంటికి ఎదురుగా వివాహిత(39) తన భర్త, పిల్లలతో కలిసి 2007 నుంచి ఉంటోంది.

శ్రీనివాస్‌ కుటుంబంతో పరిచయం ఉన్న బాధితురాలిని కొన్ని నెలలు గా తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నా­డు. ఇంటిముందు నిలబడి గట్టిగా కేకలు వేయ­డం, సదరు మహిళ గురించి చెడుగా మాట్లాడటంతో కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. మద్యం మత్తులో అలా ప్రవర్తిస్తుంటాడని భావించిన వివాహిత భర్తతో పాటు కుటుంబసభ్యులు పలు మార్లు మందలించినా ఏ మాత్రం మార్పురాకపోగా వేధింపులు తీవ్రమయ్యాయి.

నువ్వంటే ఇష్టం.. నాతో ఉండిపో.. అంటూ రోడ్డుమీదనే అటకాయించడం, తనమాట వినకపోతే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానంటూ బెదిరిస్తున్నా డు. దీంతో విసిగిపోయిన బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడు కూనపరెడ్డి శ్రీనివాస్‌పై ఐపీసీ 354(డి), 504, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చదవండి: హెచ్‌సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్‌..! మంత్రి షాకింగ్‌ కామెంట్స్‌

మరిన్ని వార్తలు