Harish Rao: ఇండియన్‌ ఐడల్‌ 2లో సత్తా చాటిన సిద్దిపేట బిడ్డ.. హరీశ్‌ రావు అభినందనలు

5 Jun, 2023 18:33 IST|Sakshi

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమైన తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 షో విజయవంతంగా ముగిసింది. గ్రాండ్‌ ఫినాలేకు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్‌ విశాఖపట్నానికి సౌజన్య భాగవతులను విజేతగా ప్రకటిస్తూ ఆమెకు ట్రోఫీ అందించాడు. హైదరాబాద్‌కు చెందిన జ‌య‌రాం ఫస్ట్‌ రన్నరప్‌గా, సిద్దిపేటకు చెందిన లాస్య ప్రియ‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. ఎంతోమంది యువ గాయకులతో పోటీ పడి రెండో రన్నరప్‌ స్థానాన్ని సాధించిన లాస్యప్రియను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌ రావు అభినందించారు.

'సింగింగ్ కాంపిటీషన్‌లో రన్నరప్‌గా నిలిచిన సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్య ప్రియకు హృదయ పూర్వక అభినందనలు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికి గొప్ప భవిష్యత్ ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను' అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 షో మొత్తం 25 ఎపిపోడ్లకు గాను 10 వేల మంది యువ గాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. సౌజన్య, జయరాం, లాస్యప్రియతో పాటు న్యూజెర్సీకి చెందిన శ్రుతి, హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ టాప్‌-5లో నిలిచారు.

చదవండి: 

మరిన్ని వార్తలు