ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే

9 Aug, 2021 13:06 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ సినిమాల సందడి మళ్లీ మొదలైంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో సీనీ ప్రియులు కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గత వారం పలు చిత్రాలు బాక్సాఫీసు వద్ద సందడి చేశాయి. ఇక  ఈ వారం కూడా అలరించేందుకు మరిన్ని సినిమాలు రెడీ అయ్యాయి. అయితే ఇందులో కొన్ని ఓటీటీ బాట పట్టాయి. స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని అటూ థియేటర్లలో, ఇటూ ఓటీటీ సందడి చేయబోయే చిత్రాలేవో ఇక్కడ చూడండి. 

థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు ఇవే:

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా నరేశ్‌ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పాగల్‌’. నివేదా పేతురాజ్‌ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక థియేటర్లు తెరుచుకోవడంతో ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్‌ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అగష్టు 14న పాగల్‌ విడుదల చేస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది. దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
సునీల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘కనబడుటలేదు’. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న  ఈ మూవీ పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులను కూడా పూర్తి చేసుకుని విడుదల సిద్దమైంది.  ఆగస్టు 13న ఈ మూవీ థియేటర్లోకి రానుంది. ఇందులో సునీల్‌ డిటెక్టివ్‌గా కనిపించనున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు ప్రేమకథను జోడించి దర్శకుడు బాలరాజు ఈ చిత్రాన్ని రూపొందించాడు. 


గరుడ శేఖర్‌నవీన్‌ వర్మ, కేవీ శ్రీనివాస్, రవీంద్రబాబు, దినేశ్‌, సునీత సద్గురు నటించిన చిత్రం ‘బ్రాందీ డైరీస్‌’. శివుడు దర్శకత్వం వహించారు. కలెక్టివ్‌ డ్రీమర్స్‌ పతాకంపై లీలా శ్రీకాంత్‌ నిర్మించారు. యువతను ఆకట్టుకునేలా కథ, కథానాలను తీర్చిదిద్దిన ఈ చిత్రం ఆగస్టు 13న విడుదల కానుంది.


సిద్దార్థ్‌ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘ఒరేయ్‌ బామ్మర్ది’. ‘బిచ్చగాడు’ ఫేం శశి తెరకెక్కించిన ఈ మూవీలో జీవీ ప్రకాశ్‌ కీలకపాత్ర పోషించాడు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. సిద్దార్థ్‌ ఇందులో ట్రాఫిక్‌ పోలీస్‌ ఆఫిసర్‌గా కనిపించనున్నాడు. బైక్‌ రేసులంటే ఆసక్తి చూపించే ఆవేశపరుడైన యువకుడి పాత్రను జీవీ ప్రకాశ్‌ పోషించాడు.

పూర్ణ, అర్జున్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సుందరి’. కల్యాణ్‌జీ గోగన దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 13న విడుదలకు సిద్దమవుతుంది. ఓ అందమైన యువతి జీవితంలో పురుషుల నుంచి ఎదుర్కొన్న ఇబ్బుందులను ఈ మూవీలో చూపించనున్నారు. 


ప్యాట్రిక్‌ విల్సన్‌, వెరా ఫార్మిగా తదితరులు కీలక పాత్రల్లో నటించిన అమెరికన్‌ సూపర్‌ నేచురల్‌ హారర్‌ ఫిల్మ్‌ ‘ది కంజురింగ్‌: దెయ్యం నా చేత చేయించింది’. మైఖేల్‌ ఛవెస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత జూన్‌లో అమెరికాలో విడుదలైంది. ఇప్పుడు ఇండియాలోని ఇండియాలో పలు భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆగస్టు 13న ఈ చిత్రం థియేటర్లలో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. 

ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఇవే: 
కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా మహరాష్ట్రలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికి ఇంకా థియేటర్లు పూర్తిగా తెరుచుకోలేదు. దీంతో గతేడాది నుంచి థియేటర్లలోనే విడుదల చేయాలని ఎదురు చూస్తున్న  సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టాయి. స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని పలు చిత్రాలు, ముఖ్యంగా దేశభక్తి చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.


సిద్దార్థ మల్హోత్రా, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘షేర్షా’. విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, క్యాష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కార్గిల్‌ యుద్ధ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. పరమ్‌ వీర్‌ చక్ర అవార్డు పొందిన కెప్టెన్‌ విక్రమ్‌ భాత్రా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. 

భారతీయ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోన్న మరో వార్‌ డ్రామా ‘భుజ్: ది ప్రైడ్‌ ఆఫ్ ఇండియా’. అజయ్‌ దేవ్‌గణ్‌, సంజయ్‌దత్‌, శరద్‌ ఖేల్కర్‌, సోనాక్షి సిన్హా, ప్రణీత, నోరా ఫతేహి, అమ్మీ వ్రిక్‌ ఇలా భారీ తారాగణంతో అభిషేక్‌ దుదియా భూజ్‌ను తెరకెక్కించాడు. థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఓటీటీ బాట పట్టింది. 1971 ఇండో-పాక్‌ వార్‌ సందర్భంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆగస్టు 15న ఈ వార్‌ డ్రామా ఓటీటీలో విడుదల కానుంది.

 
లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ప్రధానపాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘నెట్రికన్‌’. మిలింద్‌ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 13న డిస్నీఫ్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పోలీసులకు చిక్కకుండా తిరిగే సైకోను ఓ అంధురాలు పోలీసులకు ఎలా పట్టించిందనేదే ఈ మూవీ కథాంశం. 


హాస్య నటుడు సత్య కీలక పాత్రలో రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వివాహ భోజనంబు’. యంగ్‌ హీరో సందీప్‌కిషన్‌, కె.ఎస్‌.శినిష్‌తో కలిసి నిర్మించిన ఈ మూవీ పెళ్లికి వచ్చిన కుటుంబ సభ్యులు లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లి వాళ్ల ఇంట్లోనే ఉండిపోతే, వారి పరిస్థితి ఏంటి? పెళ్లి కొడుకు, అతని కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేదే ఈ మూవీ కథ.  

మరిన్ని వార్తలు