దసరా పండగకు థియేటర్లో, ఓటీటీలో సందడి చెయబోతున్న చిత్రాలు

13 Oct, 2021 18:13 IST|Sakshi

దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకులకు మరింత వినోదం పంచేందుకు పలు సినిమాలు సిద్దమయ్యాయి. ఇందులో కొన్ని థియేటర్లోకి వస్తుండగా మరికొన్ని ఓటీటీలో విడుదల కానున్నాయి. ప్రతి ఏడాది దసరాకు అగ్ర హీరో సినిమాలు పోటీ పడేవి. కానీ ఈసారి అగ్ర హీరోల సినిమాలు ఏం లేకపోవడం గమనార్హం. అయితే కుర్ర హీరోలు మాత్రం తమ లక్‌ను పరీక్షించుకునేందుకు ఈ వారంలో మీ ముందుకు రాబోతున్నారు. వెండితెర, బుల్లితెరపై సందడి చేయబోయే ఆ చిత్రాలేవో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి.

థియేటర్లో విడుదల కాబోయే చిత్రాలు 

మహా సముంద్రం
యంగ్‌ హీరోలు సిద్ధార్థ్‌, శర్వానంద్‌ల మల్టీస్టారర్‌ చిత్రం ‘మహా సముంద్రం’. అదితీ రావ్‌ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘ఆర్‌ఎక్స్‌100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రావు రమేశ్‌, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుదీర్ఘ విరామంతో నేరుగా తెలుగు సినిమాతో సిద్ధార్థ్‌ తెలుగు ప్రేక్షకులను మహా సముంద్రంతో పలకరించబోతున్నాడు. దసరా కానుకగా అక్టోబరు 14న థియేటర్‌లో విడుదల కానున్న ఈ మూవీ అతడికి ఏ మేర సక్సెస్‌ను తెచ్చిపెడుతుందో చూడాలి.


 
‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’
అక్కినేని వారసుడు అఖిల్‌, బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన వస్తోంది. అక్టోబరు 15న దసరా పండగ కానుకగా విడుదలవుతోన్న ఈమూవీని ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకుడిగా వ్యవహరించాడు. కాగా అఖిల్‌ నటించిన మూడు చిత్రాలు అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. దీంతో చాలా గ్యాప్‌ తీసుకుని మంచి హిట్‌ కోసం చూస్తున్న అఖిల్‌ ఈ ఏడాది మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌తో వస్తున్నాడు.  ఈ సారి అయినా అఖిల్‌ బ్లాక్‌ బస్టర్‌ కొడతాడో లేదో చూడాలి.

పెళ్లి సందD
సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెళ్ళిసందD’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎమ్‌ఎమ్‌ కీరవాణి స్వరాలను సమకుర్చారు. రోషన్‌కు జోడిగా కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, ట్రైలర్లకు ప్రేక్షకులను విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రం కూడా  అక్టోబరు 15న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాతోనే దర్శకేంద్రుడు నటుడిగా మారి, ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

ఓటీటీ...

సర్దార్‌ ఉద్దమ్
జలియన్‌ వాలాబాగ్‌ ఉదంతం నేపథ్యంలో విక్కీ కౌశల్‌ కీలక పాత్రలో సూజిత్‌ సిర్కార్‌ దర్శకత్వం వహిస్తున్న హిస్టారికల్‌ డ్రామా ‘సర్దార్ ఉద్దమ్‌’. విక్కీ కౌశల్‌ ఇందులో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా అక్టోబరు 16న ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది.  జలియన్‌ వాలాబాగ్‌లో సమావేశమైన స్వాతంత్ర్య సమరయోధులపై బ్రిటిష్ అధికారి, జనరల్ డయ్యర్‌ తన సైన్యంతో వచ్చి, తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో మొత్తం వెయ్యికి పైగా భారతీయులు మృత్యువాతపడ్డారు. వందల మంది మృతికి కారణమైన జనరల్‌ డయ్యర్‌ను విప్లవకారుడైన ఉద్దమ్‌ సింగ్‌ కాల్చి చంపాడు. అనంతరం ఉరిశిక్ష అనుభవించాడు. ఇప్పుడు ఈ కథతోనే విక్కీ-సూజిత్‌ సిర్కార్‌లు ‘సర్దార్‌ ఉద్దమ్‌’ తెరకెక్కించారు.

రష్మీ రాకెట్‌..
హీరోయిన్‌ తాప్సీ పన్ను తాజా చిత్రం రష్మీ రాకెట్‌. స్పోర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తాప్సీ గుజరాత్‌ అథ్లెట్‌ రష్మీ ప్రాతలో కినిపించనుంది. ఆకర్ష్‌ ఖురానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రోనీ స్ర్కూవాలా, నేహా, ప్రంజల్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 15న జీ5 ఓటీటీ వేదికగా విడుదల కాబోతోంది. కాగా గతంలో తాప్సీ నటించిన ‘థప్పడ్‌’ ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఆమె నటించిన ‘హసీనా దిల్‌రుబా’, ‘అనబెల్‌ సేతుపతి’ కూడా ఓటీటీ బాట పట్టాయి. 

మరిన్ని వార్తలు