ఓటీటీలో భారీ ధర పలికిన ‘నాంది’.. రిలీజ్‌ ఎప్పుడంటే?

9 Mar, 2021 08:23 IST|Sakshi

అల్లరి నరేష్‌ నటించిన నాంది సినిమా బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అన్నిరకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విజయ్‌ కనకమేడల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సతీష్‌ వేగేశ్న నిర్మాణ సారథ్యం వహించారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, ప్రియదర్శి, హరిష్‌ ఉతమన్‌, వినయ్‌వర్మా, ప్రవీణ్‌ తదితరులు నటించారు. బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికే ఈ సినిమా భారీ వసూళ్ళనే రాబట్టింది. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ఆహా సంస్థ రూ.2 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో మార్చి 12న ఈ మూవీ ఆహాలో ప్రసారం కానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. 

గతనెల ఫిబ్రవరి 19న రిలీజైన ‘నాంది’ రూ. 6.4 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఇదిలా వుంటే నరేష్‌కు తెలుగులో తొలి సినిమా అల్లరి. అయితే, కామెడీ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి విజయాలను సొంతం చేసుకున్న నరేష్‌, కొన్నేళ్లుగా హిట్లు లేక తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. తాజాగా నాంది రూపంలో అతనిలోని ‘సీరియస్‌’ నటుడు బయటికొచ్చాడు. అతని నటనపై విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు 55 సినిమాల్లో నటించిన నరేష్‌.. గమ్యం సినిమాలో బెస్ట్‌ సపోర్టింగ్‌ క్యారెక్టర్‌కు నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను అందుకున్నాడు.

చదవండి: కోట్లు డిమాండ్‌ చేస్తున్న నాని

మరిన్ని వార్తలు