బాలీవుడ్‌ అటెన్షన్‌ కోసం ఎప్పుడూ తాపత్రయపడలేదు

24 Apr, 2021 07:26 IST|Sakshi

దాదాపు 17 ఏళ్ళ తర్వాత నాగార్జున నటించిన హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్‌ హీరోహీరోయిన్లు. నాగార్జున, అమితాబ్‌ బచ్చన్, డింపుల్‌ కపాడియా కీలక పాత్రధారులు. చాలా గ్యాప్‌ తర్వాత హిందీ సినిమా చేయడం గురించి నాగార్జున మాట్లాడుతూ – ‘‘గతంలో కొన్ని హిందీ సినిమాలు చేశా. నాలాంటి ఆర్టిస్టులు ఏ ఇండస్ట్రీలోనైనా ఇమిడిపోగలరు. నిర్మాతలను హ్యాపీగా ఉంచగలరని నా నమ్మకం. అయినా బాలీవుడ్‌ అటెన్షన్‌ కోసం నేనెప్పుడూ తాపత్రయపడలేదు. అలాగని నేను హిందీ సినిమాలు చేయనని కాదు.

బాలీవుడ్‌ నుంచి ఎవరైనా మంచి కథతో వస్తే కాదనను. ఇక ‘బ్రహ్మాస్త్ర’ విషయానికి వస్తే.. అమితాబ్‌ బచ్చన్‌గారు ఓ కీలక పాత్ర చేసినప్పటికీ రణ్‌బీర్, ఆలియాతోనే నాకు ఎక్కువ సీన్స్‌ ఉంటాయి’’ అన్నారు. మూడు భాగాలుగా విడుదల కానున్న ‘బ్రహ్మాస్త్ర’ తొలి పార్టు ఈ ఏడాదిలో రావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. తెలుగులో చేసిన సూపర్‌ హిట్‌ మూవీ ‘శివ’ రీమేక్‌లో నటించడం ద్వారా హిందీకి పరిచయమయ్యారు నాగార్జున. ఆ తర్వాత ‘ఖుదా గవా’, ‘ద్రోహి’, ‘క్రిమినల్‌’, ‘మిస్టర్‌ బేచారా’ వంటి చిత్రాల్లో నటించారు. 2003లో చేసిన ‘ఎల్‌ఓసి కార్గిల్‌’ తర్వాత ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’లో నటించారు.
చదవండి: నా డ్రైవింగ్‌ స్కిల్స్‌ చూసి యూనిట్‌ సభ్యులు షాక్‌

మరిన్ని వార్తలు