Nani Tuck Jagadish On September 10 On OTT: తగ్గేది లేదంటున్న నాని.. థియేటర్ల యాజమానుల అసంతృప్తి

20 Aug, 2021 10:44 IST|Sakshi

సెప్టెంబర్‌ 10 ఓటీటీలోనే నాని టక్‌ జగదీష్‌

కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా.. సినిమా థియేటర్లపై భారీ ప్రభావాన్ని చూపించింది. కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ కారణంగా మూతపడ్డ థియేట్లు గత నెల 23 నుంచి తెరుచుకున్నప్పటికి పెద్ద సినిమాలేవి ఇంకా విడుదల కాలేదు. ఇప్పటికే జూలై 30న విడుద‌లైన తిమ్మరసు చిత్రం మంచి విజ‌యం సాధించ‌గా, రీసెంట్‌గా విడుద‌లైన ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమా మంచి వసూళ్లు సాధించింది. కరోనా నిబంధనల మేరకు 50 శాతం ఆక్యూపెన్సీతో ప్రస్తుతం థియేటర్లు ఓపెన్‌ కాగా, వినాయ‌క చ‌వితికి వంద శాతం ఆక్యుపెన్సీతో క‌ళ‌క‌ళ‌లాడ‌నున్నాయి.

ఈ క్రమంలో వచ్చే నెలలో విడుదల కాబోయే నాని టక్‌ జగదీష్‌, శేఖర్‌ కమ్ముల లవ్‌ స్టోరీ సినిమాల కారణంగా టాలీవుడ్‌లో ఓటీటీ, థియేటర్‌ల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. ఈ రెండు సినిమాలు వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే వీటిలో నాని టక్‌ జగదీష్‌ ఓటీటీలో రిలీజ్‌ కానుండగా.. లవ్‌ స్టోరీ థియేటర్లలో విడుదలవుతుంది. 

ఈ క్రమంలో నాని నటించిన టక్‌ జగదీష్‌ లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌ను ఓటీటీల్లో విడుదల చేయడంపై ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారీ చిత్రం ఓటీటీలో విడుదల చేయడంపై థియేటర్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టక్‌ జగదీష్‌ ఓటీటీ రిలీజ్‌పై చర్చించేందుకు థియేటర్ల యజమానులు శుక్రవారం మధ్యాహ్నం భేటీకానున్నారు. (చదవండి: టక్‌ జగదీష్‌ ఓటీటీ రిలీజ్‌పై నాని కామెంట్స్‌)

‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి హిట్ చిత్రాల దర్శకుడైన శివ నిర్వాణకు ‘టక్ జగదీష్’ సినిమా.. హ్యాట్రిక్ చిత్రం. పవర్ ఫుల్ కథతో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా చిత్ర టీజర్ కూడా తెలియజేసింది. రీతూ వర్మ, ఐశ్వర్యరాజేష్ హీరోయిన్లు. జగపతిబాబు, నాజర్ వంటి వారితో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్ అయ్యేలా ఈ చిత్రం రూపొందింది.  టీజర్ విడుదల తర్వాత సినిమాపై భారీగానే అంచనాలు పెరిగాయి. బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన సినిమా అయినప్పటికి.. నిర్మాతలు ఓటీటీ బాట పట్టారు. ఈ నిర్ణయం పట్ల థియేటర్ల యజమానులు అసంతృప్తిగా ఉన్నారు. 


(చదవండి: ఓటీటీలోకి టక్‌ జగదీష్‌! అప్పుడే అంత లాభమా?)

మరిన్ని వార్తలు