సదా ప్రేక్షకుల ప్రేమకు బానిసను..

14 Jan, 2021 09:50 IST|Sakshi
ఘాట్‌ రోడ్డుపై డ్యూయెట్‌కు స్టెప్పులేస్తున్న హీరో సంపూర్ణేష్‌బాబు, హీరోయిన్‌ మహేశ్వరి

హీరో సంపూర్ణేష్‌ బాబు

యడ్లపాడు (గుంటూరు): ప్రేక్షకుల ప్రేమకు సదా బానిసనంటూ హీరో సంపూర్ణేష్‌ బాబు చెప్పారు. మండలంలోని కొండవీడు కోట ప్రాంతంలో ఆయన మహేశ్వరి వద్దితో జంటగా కలసి నటిస్తున్న చిత్రం ‘బజార్‌ రౌడీ’ షూటింగ్‌ మూడు రోజుల పాటు జరిపారు. షూటింగ్‌కు వచ్చిన సంపూ మాట్లాడుతూ హృదయకాలేయం, సింగం 123, వైరస్, కొబ్బరిమట్ట విడుదల కాగా, తాజాగా బజార్‌రౌడీ పోస్టు ప్రొడక్షన్‌లో ఉందన్నారు. ఇవిగాక మరో మూడు సినిమాలు చేస్తున్నానని, వాటిలో ఒక చిత్రంలో మూడు పాత్రలు పోషించడం విశేషమని చెప్పారు.  చిత్రం కథానాయిక మహేశ్వరి వద్ది మాట్లాడుతూ తమిళంలో రెండు, తెలుగులో సంపూతో బజార్‌రౌడీ చేస్తున్నానన్నారు. త్వరలోనే ఈ మూడు చిత్రాలు విడుదల కానున్నాయని తెలిపారు. తాను పక్కా తెలుగమ్మాయినని,  కర్నూల్‌ జిల్లా పత్తికొండలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగానని వివరించారు. 

ముగిసిన బజార్‌ రౌడీ సినిమా షూటింగ్‌.. 
కేఎస్‌ క్రియేషన్‌ పతాకంపై సంపూర్ణేష్‌బాబు, మహేశ్వరివద్ది జంటగా నటిస్తున్న ‘బజార్‌ రౌడీ’ చిత్రం డ్యూయెట్‌ను కొండవీడు ఘాట్‌ రోడ్డు, పురాతన కట్టడాల వద్ద చిత్రీకరించారు. షూటింగ్‌ ముగింపు సందర్భంగా చిత్ర దర్శకుడు వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని కొండవీడు ఊటీ, అరకు లోయలను తలపించేలా షూటింగ్‌లకు ఎంతో అనుకూలంగా ఉందని తెలిపారు. సమావేశంలో చిత్ర నిర్మాత సంగిశెట్టి శ్రీనివాసరావు, ఎగ్టిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శేఖర్‌ అలవాలపాటి, కో–డైరెక్టర్‌ కె. శ్రీనివాసరావు, కొరియోగ్రాఫర్‌ నిక్సన్, ఫొటోగ్రఫీ కె. విజయకుమార్, ఎడిటర్‌ గోపాల్‌రాజు మాట్లాడారు. 

మరిన్ని వార్తలు