హీరో తరుణ్‌తో ‘పుష్ప’ మూవీ టీం చర్చలు!

1 Jun, 2021 21:12 IST|Sakshi

ఒకప్పుడు టాలీవుడ్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ లవ్‌ స్టోరీ చిత్రాల్లో నటించి లవర్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు హీరో తరుణ్‌. స్టార్‌ హీరోగా రాణిస్తున్న క్రమంలోనే దివంగత నటి ఆర్తీ అగర్వాల్‌తో ప్రేమవ్యవహరం వివాదంతో తరుణ్‌కు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అప్పటి నుంచి సినిమాలకు దూరమైన తరుణ్‌  ఆ తర్వాత ఆడపదడపా చిత్రాల్లో నటించినప్పటికి అవి పెద్దగా గుర్తింపు పొందలేదు.

ఇక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న తరుణ్‌ను తాజాగా ‘పుష్ప’ మూవీ టీం సంప్రదించినట్లు సమాచారం. అయితే ఏ కీ రోల్‌ కోసమో అనుకుంటే మీరు పొరపాటు పడ్డంటే. అవును.. తమ సినిమాకు వాయిస్‌ అందించాలని మేకర్స్‌ తరుణ్‌ కోరినట్లు వినికిడి. కాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘పుష్ప’లో మలయాళ నటుడు ఫహద్‌ ఫాసిల్‌ విలన్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే.

కాగా ఫహద్‌ ఫాసిల్‌కు తరుణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వాలని, ఇందుకు సంబందించిన విషయమై మేకర్స్‌ తరుణ్‌తో చర్చలు జరుపుతున్నారట. ఒకవేళ అంతా ఒకే అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. ఇక మొత్తానికి చాలా కాలం త‌ర్వాత త‌రుణ్ ఇలా ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించ‌డానికి రావడం ఆయన అభిమానులు ఆనందించే విషయమే. కాగా ఈ మూవీలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు