Hero Vishal: ఆ ఘనత విజయకాంత్‌దే: హీరో విశాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

10 Mar, 2023 10:05 IST|Sakshi

నటుడు విశాల్‌ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం మార్క్‌ అంటోని. నటుడు ఎస్‌జే సూర్య ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఇందులో నటి రీతు వర్మ, అభినయ, తెలుగు నటుడు సునీల్, నిళల్‌గళ్‌ రవి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మినీ స్టూడియో పతాకంపై వినోద్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. 

కాగా జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని బుధవారం స్థానిక సైదాపేటలోని అన్నై వేళాంగణి కళాశాలలో నిర్వహించారు. ఇందులో నటుడు విశాల్, ఎస్‌ జే సూర్య, దర్శకుడు ఆదిక్‌ రవిచంద్రన్, నిర్మాత వినోద్‌ కుమార్‌ తదితర చిత్ర వర్గాలు పాల్గొన్నారు. కాగా అన్నా వేళాంగణి కళాశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, అనేక మంది విద్యార్థులు ఈ వేడుకలు పాల్గొన్నారు. నటుడు విశాల్‌ అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందించారు. ముందుగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దక్షిణ భారత నటీనటుల సంఘానికి నటుడు విజయ్‌కాంత్‌ విశేష సేవలను అందించారన్నారు.

అప్పుల్లో ఉన్న సంఘాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చింది ఆయనేని పేర్కొన్నారు. సంఘ నూతన భవన నిర్మాణానికి విజయ కాంతే కారణమని, మరో ఏడాదిలో నూతన భవనం పూర్తి అవుతుందని చెప్పారు. ఆ తర్వాత నూతన భవనంలో నటుడు విజయ కాంత్‌కు భారీ ఎత్తున అభినందన సభను నిర్వహించినట్లు తెలిపారు. ఇక మార్క్‌ అంటోని చిత్రం గురించి చెప్పాలంటే ఇది మంచి ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. దర్శకుడు అధిక రవిచంద్రన్‌ మాట్లాడుతూ ఇది రజనీకాంత్‌ నటించిన బాషా చిత్రం తరహాలో విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు.   

మరిన్ని వార్తలు