శుభలగ్నం మేడమ్‌ అని పలకరిస్తుంటారు

27 Jan, 2021 07:18 IST|Sakshi

‘‘ప్రస్తుతం నటిగా చాలా బిజీ. మంచి సినిమాలు, మంచి పాత్రలు వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు ఆమని. ఆమె ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘అమ్మ దీవెన’. శివ ఏటూరి దర్శకత్వంలో లక్ష్మి సమర్పణలో ఎత్తరి మారయ్య, ఎత్తరి చినమారయ్య, ఎత్తరి గురవయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని శివ బాగా తెరకెక్కించాడు. ఐదుగురు పిల్లల తల్లి వాళ్లను ప్రయోజకుల్ని చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? తన కుటుంబాన్ని తీర్చిదిద్దడం కోసం ఎలాంటి త్యాగాలు చేసింది? అనే అంశాలతో ఈ సినిమా ఉంటుంది. కష్టాలు ఎదురైనప్పుడు ఎదిరించి పోరాడాలి కానీ ఆత్మహత్యతో జీవితాన్ని ముగించకూడదని మహిళలకు మంచి సందేశాన్నిచ్చే చిత్రం ఇది’’ అన్నారు.

ఇంకా మాట్లాడుతూ – ‘‘ఇప్పటికీ చాలామంది నన్ను గుర్తు పట్టి ‘శుభలగ్నం’ మేడమ్‌ అని పలకరిస్తుంటారు. ఇప్పటి జనరేషన్‌ అమ్మాయిలు కూడా ‘శుభలగ్నం’లో బాగా చేశారు అంటుంటే సంతోషంగా అనిపిస్తుంటుంది. ప్రస్తుతం మా అబ్బాయికి 6 ఏళ్లు, అమ్మాయికి 4ఏళ్లు. ఈ లాక్‌డౌన్‌లో పిల్లలతో గడిపే అవకాశం దక్కడం చాలా సంతోషంగా అనిపించింది. ప్రస్తుతం ‘చావుకబురు చల్లగా, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్, అల్లు శిరీష్‌కి తల్లిగా ఓ సినిమా, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లోనే మూడు సినిమాలు చేస్తున్నాను. సాయికుమార్‌గారితో ఓ సినిమా, వాళ్ల అబ్బాయి ఆదితో ‘బ్లాక్‌’ సినిమా చేశాను. జగపతిబాబుగారితో ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాను’’ అన్నారు.  

మరిన్ని వార్తలు