ఆసక్తి రేపుతున్న ‘సైనా’ ట్రైలర్‌

8 Mar, 2021 20:38 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి పరిణీతీ చోప్రా కథానాయికగా నటించిన చిత్రం ‘సైనా’. ఈ మూవీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కింది. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ‘దారిలో వెళ్ల‌టం ఒకటైతే దారి చూప‌టం అనేది మ‌రొక‌టి.. నువ్వు ఆ రెండో దానిపై దృష్టి సారించాలి’ అని సైనాకు త‌న త‌ల్లి చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైల‌ర్‌ మొదలవుతుంది.

సైనా పాత్రలో నటించడానికి పరిణీతి చాలా సాధన చేసినట్లు ఈ ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. చిన్నతనంలో సైనా బ్యాడ్మింట‌న్ అకాడ‌మీలో అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచీ ఒలింపిక్స్ మెడ‌ల్ గెలిచి వ‌ర‌ల్డ్‌ నంబర్‌ వ‌న్‌గా నిలిచే వరకు ఆమె కెరీర్‌లోని పలు అంశాలను కళ్లకు కట్టినట్లు ట్రైలర్‌లో చూపించే ప్రయత్నం చేశారు. చైనా వాల్‌ను బ‌ద్ధ‌లు కొడ‌తా.. అంటూ సైనా చెప్పే మరో డైలాగ్‌ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది.

‘ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ ముందుకు ‘సైనా’ మూవీ టైలర్‌ను తీసుకురావటం పట్ల చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడే ట్రైలర్ చూడండి’ అని హీరోయిన్‌ పరిణీతీ చోప్రా ట్వీటర్‌లో పేర్కొంది. అమోల్‌ గుప్తా దర్శకత్వం వహించిన ‘సైనా’ మూవీ మార్చి 26 ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ పాత్ర కోసం పరిణీతి చోప్రా బ్యాడ్మింటన్‌లో మెళకువలన్నీ నేర్చకోవడంతోపాటు సైనా, ఆమె కుటుంబంతో సమయం గడిపిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు