ప్రియమణి.. సంచలనాత్మక సైనైడ్‌

1 Oct, 2020 08:12 IST|Sakshi

జాతీయ అవార్డుగ్రహీత ప్రియమణి నటించనున్న తాజా చిత్రం ‘సైనైడ్‌’. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న రాజేష్‌ టచ్‌రివర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మిడిల్‌ ఈస్ట్‌ సినిమా పతాకంపై ఎన్నారై పారిశ్రామికవేత్త ప్రదీప్‌ నారాయణన్‌  నిర్మించనున్నారు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. దక్షిణాది భాషల్లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించనుండగా, హిందీలో యశ్‌ పాల్‌ శర్మ నటించనున్నారు. రాజేష్‌ టచ్‌రివర్‌ మాట్లాడుతూ.. ‘‘సైనైడ్‌ ఇచ్చి 20మంది యువతులను హత్య చేసిన ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ మోహన్‌ కేసును అత్యంత అరుదైన కేసుగా కోర్టు తీర్మానించింది. ఈ సంచలనాత్మక కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రియమణి ఇందులో పవర్‌ఫుల్‌ ఇన్వెస్టిగేషన్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తారు’’ అన్నారు. ప్రదీప్‌ నారాయణన్‌ మాట్లాడుతూ.. ‘‘జనవరిలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. బెంగళూరు, మంగళూరు, కూర్గ్, మడిక్కెరి, గోవా, హైదరాబాద్, కాసరగోడ్‌ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరపనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సదాత్‌ సైనూద్దీన్, సంగీతం: జార్జ్‌ జోసెఫ్‌.

మరిన్ని వార్తలు