కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్‌ శ్రద్ధాదాస్‌

22 Aug, 2022 10:56 IST|Sakshi

'అర్థం' చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది నటి శ్రద్ధాదాస్‌. మినర్వా పిక్చర్స్‌ పతాకంపై రాధిక శ్రీనివాస్‌ నిర్మించిన చిత్రం అర్థం. మణికాంత్‌ తల్లకుటి కధా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళం)లో నటుడు మాస్టర్‌ మహేంద్రన్, నటి శ్రద్ధాదాస్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇతర ముఖ్యపాత్రల్లో అజయ్, ఆమని, సావిత్రి, ప్రభాకర్, రోహిణి, రోబో శంకర్‌ నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ శనివారం చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిర్మాత శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. 'అర్థం' తనకు తమిళంలో రెండో చిత్ర మని చెప్పారు. తమిళం, తెలుగు భాషల్లో రూందించాలని భావించి నటుడు మాస్టర్‌ మహేంద్రన్‌ సంప్రదించారని, చెన్నైలో షూటింగ్‌లకు చాలా సహకరించారని చెప్పారు. హారర్, థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందించినట్లు చెప్పారు.

నటుడు మాస్టర్‌ మహేంద్రన్‌ మాట్లాడుతూ.. నిర్మాత హైదరాబాద్‌ నుంచి వచ్చి ఇక్కడ చిత్రం చేశారన్నారు. మంచి కంటెంట్‌తో కూడిన ఈ చిత్రం కోసం అందరూ శ్రమించి పని చేశారని అన్నారు. శ్రద్ధాదాస్‌ను ఈ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. శ్రద్ధాదాస్‌ మాట్లాడుతూ.. తమిళంలో తొలిసారి నటించడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు మణికాంత్‌ మాట్లాడుతూ.. తనకు తమిళంలో తొలి చిత్రమన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నైలో 70 శాతం చేసినట్లు తెలిపారు. నటుడు మాస్టర్‌ మహేంద్రన్, రోబో శంకర్, వినోద్‌ చాలా సహకరించారని తెలిపారు.

మరిన్ని వార్తలు