రజనీకాంత్, విజయ్‌ రెమ్యునరేషన్‌పై హీరోయిన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

27 Feb, 2023 07:31 IST|Sakshi

 తమిళ సినిమా: ఒకప్పుడు బాలీవుడ్‌ హీరోలు రూ.100 కోట్లు తీసుకునేవారు. ఇప్పుడు సౌత్‌ ఇండియన్‌ స్టార్లూ దాన్ని మించేశారు. తమిళనాడులోని రజనీకాంత్, విజయ్‌ వంటి నటులు రూ.120, 130 కోట్లకు పైగా పుచ్చుకుంటున్నట్లు సమాచారం. ఈ హీరోల గురించి నటి సునైనా సెటైర్లు వేసింది. ఈ పదహారణాల తెలుగు అమ్మాయి తమిళంలో కాదలిల్‌ విళిందేవ్‌ చిత్రం ద్వారా కథానాయికగా రంగప్రవేశం చేసింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో వరుసగా అవకాశాలను అందుకుంటోంది. అరుళ్‌నిధికి జంటగా నటించిన వంశం చిత్రంలో ఈమె నటనతో అందరి ప్రశంసలు పొందింది. ఆ తర్వాత నీర్‌ పార్వై, సమర్, మాసిలామణి, తెరి, సిలుక్కువార్‌పట్టి తదితర చిత్రాలతో కోలీవుడ్‌లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది.

ఇటీవల ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పేర్కొంది. మీకు స్క్రిప్ట్‌ రాసి నటించే అవకాశం వస్తే ఏ నటుడిని ఎంపిక చేసుకుంటావు అన్న ప్రశ్నకు బదులిస్తూ నటుడు విజయ్, ఫాహత్‌ సాజిద్, విజయ్‌ సేతుపతిలలో ఒకరిని ఎంపిక చేసుకుంటానని చెప్పింది. ఇటీవల బాగా నచ్చిన చిత్రం విక్రమ్‌ అని చెప్పింది. ప్రస్తుతం ప్రముఖ నటులు రూ. 100 కోట్లకు పైగా తీసుకుంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏమిటన్న ప్రశ్నకు దీని గురించి కొందరు ఇంతకుముందే తన వద్ద ప్రస్తావించినట్లు చెప్పింది. అయినా అంత డబ్బు తీసుకుని ఏం చేస్తారబ్బా? అని సందేహం తనకు కలుగుతుందని చెప్పింది.

తన తొలి చిత్రానికి రూ.15 వేలు తీసుకున్నట్లు చెప్పింది. తనకు సంబంధించిన వరకు ప్రేక్షకులు తన నటనను ఎలా ఆనందిస్తున్నారు అన్నదే ముఖ్యం అని పేర్కొంది. తాను కాదలిల్‌ విళిందేన్, సిలుక్కువార్‌పట్టి చిత్రాలను థియేటర్లలో ప్రేక్షకుల మధ్య చూశానని చెప్పింది. సిలుక్కువార్‌పట్టి చిత్రంలో నటుడు సముద్రఖనితో వాగ్వాదం చేసే సన్నివేశాలకు ప్రేక్షకులు ఈలలు వేస్తూ ఎంజాయ్‌ వేశారని చెప్పింది. అలాంటి తరుణాలే ముఖ్యమని, అందుకే తాను సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నట్లు నటి సునైనా పేర్కొంది.   

మరిన్ని వార్తలు