రియాకు మద్దతు: ట్రోల్స్‌కు కౌంటరిచ్చిన నటి

1 Sep, 2020 10:16 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తికి తోటి నటీమణుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ కేసులో నిజానిజాలు తేలకముందే రియాను నిందితురాలిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బోల్డ్‌ నటి స్వరా భాస్కర్‌, టాలీవుడ్‌ సెలబ్రిటీ లక్ష్మీ మంచు, హీరోయిన్‌ తాప్సీ పన్ను తదితరులు రియాకు మద్దతుగా నిలబడుతున్నారు. ఓ వైపు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ కొనసాగుతున్న వేళ మీడియా కూడా సమాంతర విచారణ జరుపుతూ రియాను వేధింపులకు గురిచేయడం సరికాదంటూ హితవు పలికారు. తాజాగా టీవీ నటి హీనా ఖాన్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: సుశాంత్‌ జీవితం స్ఫూర్తిదాయకం: హీనా ఖాన్‌)

ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘‘సీబీఐ విచారణ పూర్తి చేసి ఒక ముగింపునకు రానివ్వండి. ఇలాంటి నిందల వల్ల ఆమె కెరీర్‌ నాశనమయ్యే అవకాశం ఉంది. మీ కారణంగా తను ఎదుటివారికి ముఖం కూడా చూపించుకోలేని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’అని ఘాటు విమర్శలు చేశారు. ఇక అప్పటి నుంచి షరా మామూలుగానే హీనా ఖాన్‌ నెటిజన్లకు టార్గెట్‌ అయ్యారు. సుశాంత్‌ మరణానికి కారణమైన రియాను ఎలా వెనకేసుకు వస్తారంటూ ఆమెపై ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. (చదవండి: సుశాంత్ అనారోగ్యం గురించి ముందే తెలుసు)

అంతేగాక హీనా అభిమానులు సైతం తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన హీనా ఖాన్‌.. ‘‘నేనెప్పుడూ నిజం వైపే నిలబడతాను. నా అభిమానులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను. నాతో కలిసి వస్తారని ఆశిస్తున్నా! మనం ఒక్కటిగా ఉంటే ట్రోల్స్‌కి భయపడాల్సిన అవసరం లేదు. నాకైతే ఎలాంటి భయం లేదు. ఎందుకంటే ఆ సత్యమే మనం ధైర్యంగా నిలబడే శక్తిని ఇస్తుంది!. జై హింద్‌’’ సుతిమెత్తగానే కౌంటర్‌ ఇచ్చారు.  కాగా ‘యే రిష్తా క్యా కహెలాతా హై’ సీరియల్‌(తెలుగు డబ్బింగ్‌- పెళ్లంటే నూరేళ్లపంట)ల్‌లో అక్షరగా లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న హీనా.. సినిమాల్లోకి రాకముందే కాన్స్‌ ఫెస్టివల్‌లో హొయలొలికించే గౌరవం దక్కించుకున్న నటిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. (చదవండి: రియాకు న్యాయం జ‌ర‌గాలి: మ‌ంచు ల‌క్ష్మి)

మరిన్ని వార్తలు