ముగ్గురు డైరెక్టర్లు, ముగ్గురి హీరోయిన్ల కాంబో రిపీట్‌

28 Mar, 2023 01:24 IST|Sakshi

కాంబినేషన్‌ రిపీట్‌ కావడం కామన్‌. అయితే హిట్‌ కాంబినేషన్‌రిపీట్‌ అయినప్పుడు ‘హిట్‌ రిపీట్‌’ కావడం ఖాయం అనే అంచనాలు ఉంటాయి. తాజాగా మూడు కాంబినేషన్ల మీద అలాంటి అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్‌–పూజా హెగ్డే, వెంకీ కుడుముల–రష్మికా మందన్నా, అట్లీ–నయనతార... ఈ ముగ్గురు డైరెక్టర్లు, ముగ్గురి హీరోయిన్ల కాంబో రిపీట్‌ అవుతోంది. ఆ విశేషాల్లోకి వెళదాం. 

త్రివిక్రమ్‌ – పూజా హెగ్డే 
తొలిసారి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పూజా హెగ్డే కథానాయికగా నటించిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ (2018). ఈ సినిమాలో అందం, ఆత్మవిశ్వాసం, ప్రతిభ ఉన్న అరవిందపా త్ర చేశారు పూజా హెగ్డే. నటిగా తన టాలెంట్‌  నిరూపించుకోవడానికి ఈ క్యారెక్టర్‌ హెల్ప్‌ అయింది. దాంతోపా టు సినిమా కూడా ఘనవిజయం సాధించడంతో పూజా కెరీర్‌కి ప్లస్‌ అయింది.

ఆ తర్వాత రెండేళ్లకు ‘అల.. వైకుంఠపురములో’ సినిమా ప్లాన్‌ చేసి, అందులోనూ పూజా హెగ్డేని తీసుకున్నారు త్రివిక్రమ్‌. ఈ సినిమాలో పూజా హెగ్డే చేసిన అమూల్య క్యారెక్టర్‌ ఆమెకు ప్లస్‌ అయింది. ‘అల..’తో మరో హిట్‌ సినిమా ఆమె ఖాతాలో పడింది. ఇప్పుడు మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోనూ పూజానే హీరోయిన్‌. ఈ సినిమాలో పూజా హెగ్డేపా త్ర ఎలా ఉంటుంది? అనేది తెలియాల్సి ఉంది. 
 
వెంకీ కుడుముల – రష్మికా మందన్నా 
ఒక మీడియమ్‌ బడ్జెట్‌ సినిమాలో చేసిన సింపుల్, హోమ్లీ క్యారెక్టర్‌ ఆ తర్వాత పెద్ద బడ్జెట్‌ సినిమాలు, గ్లామరస్‌ రోల్స్‌ చేసే రేంజ్‌కి తీసుకెళుతుందని ‘ఛలో’ (2018) సినిమా ఒప్పుకున్నప్పుడు రష్మికా మందన్నా ఊహించి ఉండరు. కానీ ఆ మేజిక్‌ జరిగింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో చేసిన ‘ఛలో’ చిత్రం ద్వారా కన్నడ బ్యూటీ రష్మికా మందన్నా తెలుగుకి పరిచయం అయ్యారు.

తొలి సినిమానే హిట్‌. ఆ తర్వాత పెద్ద సినిమాలు చేస్తూ వచ్చిన రష్మిక మళ్లీ రెండేళ్లకు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ (2020) సినిమాలో మంచిపా త్ర చేశారు. ఈ సినిమా కూడా సూపర్‌ హిట్‌. ఇప్పుడు మళ్లీ వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక ఓ సినిమా చేస్తున్నారు. విశేషం ఏంటంటే.. ‘భీష్మ’లో నటించిన నితిన్‌ ఇందులో హీరో. ఆ విధంగా వెంకీ–నితిన్‌–రష్మికలకు ఇది రెండో సినిమా. ఈ హిట్‌ కాంబినేషన్‌ చేస్తున్న ఈ సినిమా ఇటీవలే ఆరంభమైంది.  
 
అట్లీ – నయనతార 
దర్శకుడిగా అట్లీ తొలి సినిమా ‘రాజా రాణి’ (2013) చేస్తున్నప్పటికి నయనతార స్టార్‌ హీరోయిన్‌. ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథని నమ్మి ఆమె ‘రాజా రాణి’ చేశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి చిత్రం తర్వాత అట్లీ స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్‌ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు. ఇక మళ్లీ నయనతారను ఆయన కథానాయికగా తీసుకున్న చిత్రం ‘బిగిల్‌’ (2019).

ఈ సినిమా కూడా సూపర్‌ హిట్‌. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో నయనతార ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈసారి ఈ డైరెక్టర్‌–హీరోయిన్‌ కాంబినేషన్‌లో రానున్నది హిందీ చిత్రం ‘జవాన్‌’. షారుక్‌ ఖాన్‌ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ద్వారా నయనతార బాలీవుడ్‌కి కథానాయికగా పరిచయం అవుతున్నారు. సౌత్‌లో హిట్స్‌ ఇచ్చిన ఈ కాంబో నార్త్‌లోనూ ఆ ఫీట్‌ని రిపీట్‌ చేస్తుందని ఊహించవచ్చు.

మరిన్ని వార్తలు