వాళ్లిద్దరికీ అతడితో సంబంధం: నటి స్పందన

22 Sep, 2020 16:27 IST|Sakshi

అనవసరంగా నా పేరును ప్రస్తావించవద్దు

నాతో తప్పుగా ప్రవర్తించలేదు

సోషల్‌ మీడియా యుద్ధాలు, విచారణపై నమ్మకం లేదు

నటి హూమా ఖురేషి

ముంబై: నటి పాయల్‌ ఘోష్‌ ఆరోపణలతో బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కంగనా రనౌత్‌ వంటి నటీమణులు పాయల్‌కు మద్దతు ప్రకటించగా, తాప్సీ, అనురాగ్‌ మాజీ భార్యలు నటి కల్కి కొచ్లిన్‌, ఎడిటర్‌ ఆర్తీ బజాజ్‌ సహా పలువరు సెలబ్రిటీలు అతడి అండగా నిలబడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా నటి హూమా ఖురేషి సైతం ఈ జాబితాలో చేరారు. అనురాగ్‌ తనతో ఎన్నడూ తప్పుగా ప్రవర్తించలేదని, అనవసరంగా తన పేరును వివాదంలోకి లాగవద్దంటూ పాయల్‌పై మండిపడ్డారు. మీటూ ఉద్యమానికి ఉన్న పవిత్రతను నాశనం చేయవద్దని హితవు పలికారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ లేఖ షేర్‌ చేశారు.(చదవండి: అంతా అబద్ధం: అనురాగ్‌ కశ్యప్‌)

‘‘అనురాగ్‌ నేను 2012-13 సంవత్సరంలో కలిసి పనిచేశాం. తను నాకు ప్రియమైన స్నేహితుడు. ఎంతో ప్రతిభావంతుడైన దర్శకుడు. నాకు తెలిసినంత వరకు తను నాతో గానీ, ఇతరులతో గానీ ఇంతవరకు ఎప్పుడూ చెడుగా ప్రవర్తించలేదు. అయితే ఆయనపై ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్లు అధికారులకు, పోలీసులకు, న్యాయ వ్యవస్థకు ఫిర్యాదు చేయాలి. ఈ విషయంపై నేను స్పందించకూడదు అనుకున్నా. ఎందుకంటే సోషల్‌ మీడియా యుద్ధాలు, మీడియా విచారణలపై నాకు నమ్మకం లేదు. అయితే నా పేరును ఇందులోకి లాగడం ఆగ్రహాన్ని తెప్పించింది. ఎన్నో ఏళ్లుగా కఠిన శ్రమకోర్చి తనకంటూ ప్రత్యేక గుర్తిం పు తెచ్చుకున్న మహిళలు ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. నా ఫైనల్‌ రెస్పాన్స్‌ ఇది. ఈ విషయంలో ఇకపై నన్ను ఎవరూ సంప్రదించవద్దు’’ అని హూమా ఖురేషి మీడియాకు విజ్ఞప్తి చేశారు.(చదవండి:మేము బెస్ట్‌ఫ్రెండ్స్‌; నాకు చెప్పాల్సిన అవసరం లేదు!

కాగా అనురాగ్‌ తెరకెక్కించిన గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసేపూర్‌ సినిమాతో హూమా బాలీవుడ్‌ తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల షేర్‌ చేసిన వీడియోలో పాయల్‌ సంచలన ఆరోపణలు చేశారు. అనురాగ్‌ తనను లైంగికంగా వేధించాడని, రిచా చద్దా, హూమా ఖురేషి వంటి వాళ్లు అతడు ఫోన్‌ చేసినప్పుడల్లా వెళ్లి సంబంధం కొనసాగిస్తారంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయంపై ఫైర్‌ అయిన రిచా చద్దా పాయల్‌పై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించగా, హూమా ఖురేషి ఈ మేరకు స్పందించారు.

మరిన్ని వార్తలు